వ్యాపం స్కాం ‘చిన్న స్కాం’:నోరు జారిన బీజేపీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం స్కాం విషయంలో బీజేపీ నాయకులు నోరు పారేసుకున్నారు. అదేం పెద్ద కుంభకోణమని తమకు అనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాం గురించి తమకెందుకు భయమని, ధీమాగానే ఉన్నామన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయవార్జియా భోపాల్ లో వ్యాపం స్కాం పై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమకు ఇది చాల చిన్న కుంభకోణం, మీకు మాత్రం పెద్ద కుంభకోణంలా కనపడుతుందని విలేకరులతో అన్నారు. ఎందుకు మీకు అలా కనపడుతుందని విలేకరులను ప్రశ్నించారు.
వ్యాపం స్కాం గురించి భయపడుతున్న వారి నైతికస్థితి చాల దిగజారిందని చెప్పారు. తాము మాత్రం చాలా ధైర్యంగా ఉన్నామని, భయపడే సమస్యేలేదని వివరించారు. వ్యాపం స్కాం కుంభకోణంపై పలు కథనాలు ప్రచురించి అనుమానాస్పదస్థితిలో మరణించిన టీవీ జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తెలిసిందని, అయితే ఆయన తనకంటే చాల గొప్పవాడు కాదు కదా అని నోరుపారేసుకున్నారు. తరువాత జరిగిన పొరపాటు తెలుసుకున్న కైలాష్ విజయవార్జియా తల పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంలో ఇప్పటి వరకు నిందితులు, సాక్షులు 43 మంది అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం తెలిసిందే.