Warning: వినాయక చవితి ఎఫెక్ట్, 200 మంది రౌడీలకు ఫుల్ వార్నింగ్, సంతకాలు చెయ్యండి !
బెంగళూరు: వినాయక చవితి సందర్బంగా బెంగళూరు నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న రౌడీషీటర్లు, రౌడీల అనుచరుల మీద ఐటీ హబ్ పోలీసులు పంజా విసిరారు. రోజు సంతకాలు చెయ్యాలని, ఎక్కువ చేస్తే బెండ్ తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పండుగల సమయంలో రౌడీల పంచాయితీలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడాలని పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
వినాయక చవితి ఎఫెక్ట్
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసు అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. వినాయకచవితి పండుగను అడ్డం పెట్టుకుని రౌడీమామూళ్లు వసూలు చెయ్యకూడదని, అమాయకులు బెదిరించకూడదని పోలీసులు రౌడీలకు వార్నింగ్ ఇచ్చారు.
ఐటీ హబ్ లోని ఈ ఏరియాల్లో ?
బెంగళూరు నగరంలోని రాజగోపాల నగర, శ్రీరామ్ పుర, బాగలగుంటే, పిణ్యా, యశవంతపురం, ఆర్ టీ నగర్, సంజయ్ నగర్, హెబ్బాళ, నందినిలేఔట్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో నివాసం ఉంటున్న 209 మంది రౌడీలను శనివారం వేకువ జామున అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు వారిని స్థానిక పోలీస్ స్టేషన్ లకు పిలుచుకుని వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఎక్కువ చేస్తే సినిమా చూపిస్తాము జాగ్రత్త
పండుగ సందర్బంగా ఎవరైన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారి మీద కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని కొందరికి పోలీసు అధికారులు సూచించారు. గత కొన్ని రోజుల నుంచి బెంగళూరు పోలీసులు అనేక మంది రౌడీలను అదుపులోకి తీసుకుని వార్నింగ్ లు ఇస్తున్నారు.