50లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పొచ్చు.. కానీ మేమలా చెప్పలేదు.. ఎందుకంటే.. : తేజస్వి
ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు ఉద్యోగాలు కల్పించలేరని,ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేరని మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ విమర్శించారు. విద్య,వైద్యం,ఉద్యోగం,వ్యవసాయం గురించి తాను చాలా గౌరవంగా మోదీని అడుగుతున్నానని... కానీ ఆయన సమాధానం చెప్పలేక తనపై మాటల దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల కల్పన ఆయన వల్ల కాని పని అని విమర్శించారు.
సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్రాజ్ అంటూ బీజేపీ(వీడియో)
బీహార్లో 10లక్షల ఉద్యోగాల కల్పనకు తామిచ్చిన ఎన్నికల హామీపై వస్తున్న విమర్శలను తేజస్వి తోసిపుచ్చారు. 'మేమేమీ గాల్లో మాట్లాడట్లేదు. 50లక్షల ఉద్యోగాలిస్తాం లేదా ఒక కోటి ఉద్యోగాలిస్తామని కూడా మేము చెప్పి ఉండవచ్చు. కానీ మేమలా చేయలేదు. నిపుణులను సంప్రదించి.. వారితో చర్చించిన తర్వాతే 10లక్షల ఉద్యోగాలు సాధ్యమే అన్న నిర్ణయానికి వచ్చాం.' అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.బీహార్లో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్(జేడీయూ-బీజేపీ) గత 15ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చింది..?' అని ప్రశ్నించారు.
ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ హంగ్ ఏర్పడితే... తేజస్వి నితీశ్తో పొత్తు పెట్టుకుంటారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. నితీశ్తో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చెప్పారు. నితీశ్కు ఎంతసేపూ కుర్చీ పైనే ప్రేమ అని విమర్శించారు. ప్రజా నిర్ణయాన్ని ఎలా గౌరవించాలో తమకు తెలుసునని చెప్పారు. బీజేపీ,నితీశ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న తాము... అదే పార్టీలతో ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు.
కాగా,అక్టోబర్ 28న బీహార్ తొలి విడత ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా... నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై ఈసారి తేజస్వి యాదవ్ చాలా ధీమాతో కనిపిస్తున్నారు. అటు సర్వేలు మాత్రం ఎన్డీయే కూటమికే పట్టం కట్టాయి.ఈ నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది నవంబర్ 10న వెల్లడయ్యే ఫలితాలతో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నితీశ్ రాజకీయాలకు దాదాపుగా ఎండ్ కార్డ్ పడ్డట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.