అసెంబ్లీ సమీపం నుంచి బుల్లెట్ ట్రైన్.. అమరావతికి హైస్పీడ్ కనెక్టివిటీ.. రూట్ ఫిక్స్!
హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా చెన్నై వరకు సాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక పురోగతి కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో ఈ హై స్పీడ్ రైలు ప్రయాణించే మార్గాన్ని ఖరారు చేసి కేంద్ర రైల్వే శాఖకు ప్రతిపాదనలను పంపించింది. ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదిక మరియు అలైన్మెంట్ అధ్యయనాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఏడు ప్రధాన బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో హైదరాబాద్- అమరావతి- చెన్నై
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత ఇచ్చిన ఏడు ప్రధాన బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో ఇది ఒకటి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ నిర్మాణంలో పొందిన సాంకేతిక అనుభవాలను ఉపయోగించి హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా చెన్నై వరకు సాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మార్గాన్ని రూపొందిస్తున్నారు. అలైన్మెంట్కు కేంద్రం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే మూడు రాష్ట్రాలు తమ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో భూసేకరణను వేగవంతం చేస్తాయి.

E5 రహదారి మీదుగా బుల్లెట్ ట్రైన్ ఎలివేటేడ్ కారిడార్
అన్ని సాంకేతిక అధ్యయనాలు, అనుమతులు పూర్తయిన తర్వాత 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. శంకుస్థాపన తర్వాత మూడు నుంచి ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసి రైలును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇందులో భాగంగా అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు E3 కి సమాంతరంగా నిర్మిస్తున్న E5 రహదారి మీదుగా బుల్లెట్ ట్రైన్ ఎలివేటేడ్ కారిడార్ వెళుతుంది.
అసెంబ్లీ పక్క నుండి ఎత్తయిన స్తంభాలపై అందంగా అద్భుతంగా
ఈ మార్గం N6 రోడ్ జంక్షన్ ద్వారా సాగి రాబోయే శాశ్వత అసెంబ్లీ భవనం మరియు ప్రభుత్వ కాంప్లెక్స్ సమీపం నుండి వెళుతుంది. అసెంబ్లీ పక్క నుండి ఎత్తయిన స్తంభాలపై ప్రయాణించే ఈ కారణం రాజధానికి ఒక సుందర దృశ్యాన్ని అందిస్తుంది. అంతే కాదు విజయవాడ, గుంటూరు నగరాలతో వేగవంతమైన అనుసంధానాన్ని కూడా కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టులో అమరావతి పరిధిలో భూసేకరణ సమస్యలు లేకపోవడం అత్యంత ముఖ్యమైన విషయం.
అమరావతి మాస్టర్ ప్లాన్ లోనే ఎలివేటెడ్ నిర్మాణాలకు స్థలం
అమరావతి మాస్టర్ ప్లాన్ లో e3 ,e5 వంటి ప్రధాన రహదారులకు ముందే 60 మీటర్ల రైట్ ఆఫ్ వే కేటాయించారు. ఆరు నుంచి తొమ్మిది వరుసల రహదారులతో పాటు భవిష్యత్తు మెట్రో మరియు బుల్లెట్ ట్రైన్ వంటి ఎలివేటెడ్ నిర్మాణాలకు అవసరమైన స్థలం ముందే వదిలిపెట్టడం వల్ల స్తంభాల నిర్మాణం సులభంగా జరుగుతుంది. మొత్తం 770 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎలివేటేడ్ కారిడార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది.
హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 1 గంట 10 నిమిషాల్లోనే
హైదరాబాద్ నుంచి బయలుదేరి అమరావతి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా చెన్నై చేరుకుంటుంది. గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు వల్ల హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రస్తుతం పడుతున్న 12 గంటల సమయం కేవలం 2.5 నుంచి 3 గంటలకు తగ్గుతుంది. అంతే కాదు హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 1 గంట 10 నిమిషాల్లోనే ఈ బుల్లెట్ ట్రైన్ తో చేరుకోవచ్చు. ఇది ఈ ప్రాంత పురోగతికి దోహదం చేస్తుంది.



Click it and Unblock the Notifications