సాక్షికి షాక్: మాకు సంబంధం లేదన్న బీజేపీ, ఎందరు భర్తలని భట్
న్యూఢిల్లీ: తమ పార్టీ ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్థించడం లేదు. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహ గురువారం మాట్లాడుతూ... సాక్షి వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని చెప్పారు.
సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానివి ఏమాత్రం కాదన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మరో బీజేపీ నేత నళిన్ కోహ్లీ కూడా అదే చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.
కాగా, సాక్షి మహరాజ్ వ్యాఖ్యల పైన విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దేశ జనాభా విధానం ఏమైనా మారిందా, ఈ అంశం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 గంటల పాటు ఎందుకు మౌనం వహించారని, హోంమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు, ఆర్థిక మంత్రి ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిలదీశారు.
అధికార పక్షం వాస్తవ అంశం నుండి దృష్టిని మళ్లించేందుకు, సమాజాన్ని రెండుగా విడగొట్టేందుకు తమ ఎంపీల ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష ఉపనేత ఆనంద్ శర్మ అన్నారు. ప్రధాని ఈ వ్యాఖ్యల పైన స్పందించాలని డిమాండ్ చేశారు.

సాక్షి మహరాజ్ వ్యాఖ్యల పైన ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ ట్విట్టర్లో స్పందించారు. హిందూ మహిళలు అందరు నలుగురు పిల్లల్ని కనాలని చెబుతున్నారని, అది మంచి విషయమే కానీ, ఎంతమంది భర్తలు అన్నది చెప్పలేదన్నారు.
సంగీత దర్శకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు విశాల్ దద్లానీ మాట్లాడుతూ.. అభివృద్ధికి బీజేపీ అర్థం అంటే ఏమిటో ఇప్పటికి తనకు తెలిసిందని, నూతన అభివృద్ధి మూర్ఖత్వంగా ఉందని, దానివల్ల ప్రతిరోజు జాతి అతిగా వ్యాప్తి అవుతోందని విమర్శించారు.
కాగా, బిజెపి ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మరో వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలను కనాలని ఆయన సూచించారు. శుక్రవారం మీరట్లో జరిగిన సంత్ సమాగమ్ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్య చేశారు.
నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు ఉండాలనే దృష్టికోణం భారతదేశంలో పనిచేయదని, హిందూ మతాన్ని రక్షించడానికి ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలకు జన్మ ఇవ్వాలని ఆయన అన్నారు. ఘర్ వాపసి మతమార్పిడులకు సమానమైంది కానప్పటికీ మతమార్పిడులకు పాల్పడేవారికి మరణ శిక్ష వేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications