గాలి పెళ్లికి విజయనగరం ‘హంపి’సెట్టింగ్స్ !
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఇప్పటికే దాదాపుగా పెళ్లి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు.
బెంగళూరు నగరంలో విలాసవంతమైన వివాహ శుభకార్యాలకు కేరాఫ్ అడ్రస్ ప్యాలెస్ గ్రౌండ్స్. ఇలాంటి ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చెయ్యడానికి గత నెల రోజుల నుంచి అన్ని సిద్దం చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహ శుభలేఖలతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
విజయనగర సామ్రాజ్యం గుర్తుకు వచ్చేలా
శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు నిర్వహించిన చరిత్ర గాలి జనార్దన్ రెడ్డికి ఉంది. ఆయన హయంలోనే శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన హంపి లాంటి అద్భుత శిల్పాలతో బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో సెట్టింగ్స్ వేస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.
పెళ్లిలో గ్రామీణ వాతావరణం !
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి సందర్బంగా బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో పెళ్లి కుమారుడు రాజీవ్ రెడ్డి కుటుంబ సభ్యుల విశ్రాంతి కోసం ఒకటి, గాలి కుటుంబ సభ్యుల విశ్రాంతి కోసం మరో ఒకటి (తాత్కాలిక ఇండ్లు) నిర్మిస్తున్నారని అక్కడ పని చేస్తున్న వారు చెబుతున్నారు. ఈ రెండు ఇళ్లు పక్కా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నిర్మిస్తున్నారని సమాచారం.
బాలీవుడ్ నిపుణులు
ప్యాలెస్ గ్రౌండ్స్ లో పెళ్లి కళ్యాణమంటపం నిర్మించడానికి, పరిసర ప్రాంతాలు సుందరంగా అలంకరించడానికి కర్ణాటకలోనే ప్రసిద్ధి చెందిన ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడప అండ్ టీంతో పాటు బాలీవుడ్ కు చెందిన శ్రీరామ అయ్యంగార్, సుజీత్ సావంత్ తదితరులు హంపి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు సెట్టింగ్స్ రూపోందిస్తున్నారని సమాచారం.
గాలి ఇంట పెళ్లికి చలో బెంగళూరు
గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం (పెళ్లి)కి పెద్ద ఎత్తున బళ్లారి నుంచి ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు వేల సంఖ్యలో బెంగళూరు రావడానికి అన్ని ఏర్పాట్లుచేసుకుంటున్నారు.
ఆహ్వానం ఉన్నవారికే, భారీ బందోబస్తు
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ శుభకార్యానికి ఆహ్వాన పత్రికలు ఉన్న వారినే అనుమతించాలని నిర్ణయించారు. శాంతిభద్రతల సమస్యలు ఎదురుకాకుండా చూడటానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. బాలివుడ్ తారలు షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, ప్రభుదేవా, తమన్నా తదితరులు ఈ వేడుకలకు హాజరుకానున్నారని సమాచారం. 30 మంది సెక్యూరిటీ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రెండు ప్రవేశ ద్వారాలు, మూడు ఎగ్జిట్ ద్వారాలు ఇప్పటికే సిద్దం చేశారు.