15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తత
కోల్కత: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా సాగిస్తోన్న ప్రచార కార్యక్రమాలు దాడులు, ప్రతిదాడులకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. వాహనాల విధ్వంసం సర్వసాధరణమైంది. ర్యాలీలపై రాళ్లు విసరడం నిత్యకృత్యమైంది. తాజాగా- బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత వరుసగా 15 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారు.
బీజేపీ లోక్సభ సభ్యుడి ఇంటిపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. నార్త్ 24 పరగణా జిల్లాలోని భట్పారా జగద్దల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భట్పారాను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. అలర్లు, దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకోకుండా ఉండటానికి కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకున్నారు. పోలీసులు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. తాజాగా- బాంబు పేలుళ్లు సంభవించడానికి ముందే అవి అవి ధ్వంసమైనట్లు గుర్తించారు.
ఈ దాడులకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. తన నివాసం, కార్యాలయంపై తృణమూల్ గూండాలు బాంబు దాడులకు పాల్పడినట్లు బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. బైక్లపై వచ్చిన 15 మంది తృణమూల్ గూండాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, తన ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని చెప్పారు. ఈ ఘటనకు తానే ప్రత్యక్షసాక్షినని పేర్కొన్నారు. బీజేపీ నేతల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ ఈ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.
నిపై పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జ్ కైలాష్ విజయ్వర్గీయ, ముకుల్ రాయ్ స్పందించారు. బాంబు దాడులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయాందోళనలకు గురి చేయడానికి తృణమూల్ కుట్ర పన్నిందని ఆరోపించారు. సమాచారం అందిన వెంటనే ఏసీపీ ఏపీ చౌధరి, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. బాంబుదాడులకు కారణమైన వారిని గుర్తిస్తామని చెప్పారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.