అసదుద్దీన్ ఒవైసీకి జీరో: ఖాతా తెరవలేకపోయిన మజ్లిస్: అదే దారిలో మరిన్ని
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే- అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నందిగ్రామ్లో ఆమె వెనుకంజలో ఉండటం ఆ పార్టీ నేతలను నిరాశకు గురి చేస్తోంది. ఇంకా పలు రౌండ్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మిగిలి ఉండటం వల్ల అతి కష్టంతోనైనా గట్టెక్కుతారనే విశ్వాసం అధికార పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది.
ఈ సారి ఎలాగైనా బెంగాల్లో పాగా వేయాలనే ఉద్దేశంతో సర్వశక్తులనూ ఒడ్డిన భారతీయ జనతా పార్టీకి మరోసారి శృంగభంగమే ఎదురుకానుంది. కమలనాథులు మూడంకెలను కూడా అందుకోలేకపోతున్నారు. మమతా బెనర్జీ హవా బలంగా వీస్తోందక్కడ. దీనిముందు- బీజేపీ మినహా మరే పార్టీ కూడా నిలవలేకపోతోంది. సుదీర్ఘకాలం పాటు బెంగాల్ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్నారు. ప్రధాన పొటీ తృణమూల్, బీజేపీ మధ్యే నిలిచింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీ.. ఏవీ ఖాతాను తెరవలేకపోతున్నాయి.

ఇదే జాబితాలో హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా చేరింది. ఒక్క చోట కూడా మజ్లిస్ ఆధిక్యాన్ని ప్రదర్శించట్లేదు. బిహార్ ఎన్నికల్లో అంచనాలకు మించిన స్థాయిలో అయిదు స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం.. అదే ఊపును బెంగాల్లో కొనసాగించలేకపోయింది. ఈ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది. తొలుత పీర్జాదా అబ్బాసీ సిద్ధిఖీకి చెందిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది ఎంఐఎం.
సిద్ధిఖీ పార్టీ జాయింట్ మోర్చాతో కలిసి పోటీ చేయడంతో..మజ్లిస్ ఏకాకిగా మారింది. ఒంటరిగా పోటీ చేసింది. మైనారిటీల ఓటుబ్యాంకు బలంగా ఉన్న మాల్దా, ముర్షీదాబాద్ జిల్లాల్లో 17 స్థానాల్లో పోటీ చేసింది. ఎక్కడే గానీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తాజాగా వెలువడుతోన్న ఫలితాల్లో ఆధిక్యతలో కనిపించట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్పీ, బీఎస్పీ తరహాలోనే ఖాతాను కూడా తెరవలేకపోతోంది. 17 నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కడం కష్టమేననే వార్తలు వస్తున్నాయి. చివరి రౌండ్లలో కొద్దో, గొప్పో ఓట్లను దక్కించుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications