రేపిస్టులకు 10 రోజుల్లో ఉరి: ఏపీ దిశ దిక్సూచి- బిల్లుకు ఆమోదం
Aparajita Bill 2024: కోల్కతలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
ఆర్జీ కార్ ఉదంతం..
ఈ నెల 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు రేప్కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

దేశవ్యాప్త నిరసనలు..
ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు. ఈ ఘటనలో మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అరెస్ట్ అయ్యారు కూడా.
కీలక నిర్ణయాలు..
ఈ దారుణ ఉదంతం తరువాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన దిశ తరహా బిల్లుకు జీవం పోసింది. అత్యాచార ఘటనల్లో దోషిగా తేలిన రేపిస్టులకు మరణదండన విధించేలా రూపొందించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ కొద్దిసేపటి కిందటే ఆమోదించింది.
అపరాజిత బిల్లు..
ఈ బిల్లు పేరు- అపరాజిత విమెన్ అండ్ ఛైల్డ్ (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాల సవరణ) బిల్లు 2024. ఈ ఉదయం ముఖ్యమంత్రి మమత బెనర్జీ దీన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై మాట్లాడారు. బిల్లు ఉద్దేశాలను సభకు వివరించారు. ఆర్జీ కార్ ఉదంతంపైనా మాట్లాడారు. ఓ ప్రకటన చేశారు.
సీబీఐకి బదిలీ..
మహిళా డాక్టర్ ఆగస్టు 9వ తేదీన మరణించారని అదే రోజు తాను మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని గుర్తు చేశారు. అత్యాచారం జరిగిన 12 గంటల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని మమత సభకు వివరించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ అయిందని, నిందితుడికి మరణశిక్ష విధించాలనేది తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు.

హైలైట్స్ ఇవే..
అత్యాచారం చేసినా, హత్యకు పాల్పడినా 10 రోజుల్లో మరణశిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. పెరోల్ లభించే వీలు ఉండదు. జీవిత ఖైదును విధించవచ్చు.
న్యాయ సంహితలో కూడా మార్పులు..
భారతీయ న్యాయ్ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం 2012లోని సెక్షన్లలో కూడా కొన్ని మార్పులను సూచించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా. త్వరితగతిన శిక్ష పడటానికి అవరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రతిపాదించింది.
యాసిడ్ దాడులు చేసినా..
భారతీయ న్యాయ్ సంహిత 2023లోని 64, 66, 70 (1), 71, 72 (1), 73, 124 (1), 124 (2) సెక్షన్లను సవరించడానికి ఈ బిల్లు వెసలుబాటు కల్పిస్తుంది. అత్యాచారం, అత్యాచారం- హత్యల్లో నిందితుడికి మరింత కఠిన శిక్ష పడేలా చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది. సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు చేసినా గరిష్ఠ శిక్ష పడుతుంది.
మైనర్లయినా..
అత్యాచారానికి పాల్పడిన నిందితులు మైనర్లయితే- అంటే.. 16 ఏళ్లు, 12 ఏళ్లు, 18 ఏళ్ల లోపు వయస్ససు ఉన్న వాళ్లయినప్పటికీ.. గరిష్ఠ శిక్ష పడాల్సిందేనని, రేప్ చేసిన బాల నేరస్తులకు శిక్ష తగ్గించేలా ఆయా చట్టాల్లో గల సెక్షన్లు 65 (1), 65 (2), 70 (2)లను తొలగించాలని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications