మమతా బెనర్జీకి షాక్ తప్పదు: నందిగ్రామ్లో సువేందు అధికారి నామినేషన్, భారీ ర్యాలీ
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య నువ్వానేనా? అన్నట్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 293 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే.. నందిగ్రామ్ అసెంబ్లీ నియోకవర్గం మరో ఎత్తు అవుతోంది. కీలక వ్యక్తులు బరిలో దిగుతుండటంతో ఈ పోరు మరింత ఉత్కంఠకు తెరతీస్తోంది.
నందిగ్రాంలో నామినేషన్ వేసిన సువేందు అధికారి
నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమెను ఢీకొట్టేందుకు టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరిన సువేందు అధికారి సిద్ధమయ్యారు. తాజాగా, సువేందు అధికారి శుక్రవారం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మమతా బెనర్జీతో పోటీలో సువేందు అధికారి ఢీ
సీఎం మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడిస్తానని సువేందు అధికారి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రితో సువేందు తలపడుతుండటంతో ఇక్కడి పోరు ఆసక్తిగా, ఉత్కంఠగా మారింది. బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక దేవాయలంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి హాజరయ్యారు.
బెంగాల్ కాషాయ జెండా.. దీదీకి నంద్రిగామే గుర్తుంటుంది..
కాగా, నందిగ్రామ్ లో స్థానికులతో సువేందు అధికారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ ప్రాంత ప్రజలతో తనకున్న అనుబంధం ఈనాటిది కాదని సువేందు అధికారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ఐదేళ్లకోసారి వస్తారని అన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీతోనే ఉంటారని నమ్మకంతో ఉన్నామన్నారు. మమతపై 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి నందిగ్రామ్ ఒక్కటే గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నారు. బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.
వీల్ చైర్ నుంచే ప్రచారమంటూ మమతా బెనర్జీ
మమత బెనర్జీ కూడా సవాలుగా తీసుకుని నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం నంద్రిగ్రామ్ పర్యటనలో గాయపడిన మమతా బెనర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి గాయమైనప్పటికీ తాను వీల్ చైర్ నుంచే ప్రచారం చేస్తానని మమతా బెనర్జీ చెప్పడం గమనార్హం.