లాక్ డౌన్ ఎత్తేశాక ఏం జరగబోతోంది ? పాశ్చాత్య దేశాల అనుభవం నేర్పుతున్న పాఠాలేంటి ?
గతేడాది చివర్లో ప్రభావం చూపడం మొదలుపెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాది ఆరంభానికి దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ఒకరి వెంట మరొకరు లాక్ డౌన్ లు విధించడం మొదలుపెట్టారు. చివరికి అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ వంటి అగ్రదేశాలు కూడా లాక్ డౌన్ విధించక తప్పని పరిస్ధితి. అయితే కాస్త ముందు, కాస్త వెనుకగా ఒక్కొక్కరూ లాక్ డౌన్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఇదే కోవలో భారత్ లోనూ లాక్ డౌన్ ఎత్తేసేందుకు వీలైన అన్నిదారులనూ కేంద్రం వెతుకుతోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా లాక్ డౌన్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలేంటి ? ప్రపంచ దేశాల నుంచి ఈ దిశగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటనే చర్చ జరుగుతోంది.

లాక్ డౌన్ ఎత్తేసిన దేశాల పరిస్దితి...
తాజాగా మే 10వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తేసిన బ్రిటన్ లో పరిస్దితిని ఓసారి గమనిస్తే ... ఇళ్లలో నుంచి బయటికి వచ్చి తిరిగేందుకు, పార్కుల్లో గడిపేందుకు, ఆటస్ధలాల్లో ఆడుకునేందుకు మే 13 నుంచి అనుమతి కల్పిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి కాకుండా ఆఫీసులకు వచ్చి పని చేసే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో పనిచేసే వారిని ప్రజా రవాణా ద్వారా కాకుండా వ్యక్తిగత వాహనాల్లో ఆఫీసులకు వచ్చి పని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. జూన్ 1 నుంచి కొన్ని షాపులు, ప్రాథమిక పాఠశాలలను తెరుస్తున్నారు. జూలై 1 నుంచి ఆతిధ్య రంగం ప్రారంభం కానుంది. ఎయిర్ పోర్టుల్లో దిగగానే 14 రోజుల క్వారంటైన్ విధిస్తున్నారు. ఐదు స్ధాయిల్లో లాక్ డౌన్ నుంచి బయటికి వచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం నాలుగో దశ నుంచి మూడో దశకు చేరుకుంటోంది. అయితే ఈ చర్యలన్నీ విమర్శలకు దారి తీస్తున్నాయి. రోజుకు 4 వేల కరోనా కేసులు, 300 మంది చనిపోతున్న తరుణంలో ఇలాంటి చర్యల వల్ల వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందనే విమర్శలు వస్తున్నాయి.

ఇతర యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్ధితి..
యూరప్ లోని ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం వంటి దేశాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య రోజూ భారీగా నమోదవుతోంది. అదే సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. చాలా దేశాలు విభిన్న మార్గాల్లో లాక్ డౌన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఐర్లాండ్ వంటి దేశాల్లో జూలై 20 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకూ పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులూ, స్నేహితులకు అనుమతించాలని నిర్ణయించారు. అలాగే జర్మనీలో ప్రఖ్యాత బుండేస్ లిగా టోర్నీ నిర్వహణకి ప్రభుత్వం మే 16 నుంచి అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్ లోనూ మే 11 నుంచి తక్కువ దూరం ప్రయాణాలను సైతం అనుమతిస్తున్నారు. పారిస్ లో స్కూల్స్ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది. జూన్ నుంచి కేఫ్ లు, రెస్టారెంట్లు తెరిచేందుకు బెల్జియం అనుమతిచ్చింది. యూరప్ లో మిగతా దేశాలతో పోలిస్తే రష్యాలో కేసుల సంఖ్య 2 లక్షలు దాటి పోయింది. దీంతో మే 31 వరకూ లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. అమెరికాలోనూ రోజుకు 20 వేల కొత్త కేసులు వస్తున్నప్పటికీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆసియా దేశాలపై ప్రభావం...
యూరప్ దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించడంలో ఎంతో ముందున్నాయి. భారత్ తో పాటు చైనా, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పరిస్ధితి నియంత్రణలోనే ఉంది. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన దేశాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజాగా తేలింది. వీటిలో యూరప్ లోని బ్రిటన్, జర్మనీతో పాటు ఆసియాలోని చైనా, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. జపాన్ లో లాక్ డౌన్ ఎత్తేశాక జనం రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోవడంతో కేసుల సంఖ్య రెట్టింపుగా నమోదవుతోందని తెలుస్తోంది. ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటి కారణాలతో పరిస్ధితి తిరిగి మొదటికి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు...
తాజాగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్ధితులు, అంచనాలు తలకిందులు అయి కేసులు పెరుగుతున్ననేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన దేశంలో లాక్ డౌన్ సడలింపుల విషయంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఇట్టే అర్ధమవుతుంది. ఇందులో భాగంగా కంటైన్ మెంట్ జోన్లలో తీవ్ర ఆంక్షలు కొనసాగిస్తూనే మిగతా ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేసి తీరాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. వృద్ధులు, రోగుల విషయంలోనూ ఓ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇతర దేశాల అనుభవాలు గుర్తుచేస్తున్నాయి. ప్రజా రవాణాపై ఆంక్షలను కూడా క్రమంగా సడలించడంతో పాటు అవసరం లేని విదేశీ ప్రయాణాలను కూడా తగ్గించగలిగితేనే ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది. విదేశాలతో పోలిస్తే మన దేశంలో కేసుల సంఖ్య ఇంకా తీవ్ర స్ధాయికి వెళ్లలేదు. కాబట్టి వారిని అనుసరిస్తూ షాపింగ్ మాల్స్, విద్యాసంస్ధలు, రెస్టారెంట్లు, థియేటర్లు తెరవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కనీసం మరో నెల రోజులైనా ఆగితేనే మంచిందంటున్నారు. ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి 80 శాతం పట్టణాలు, నగరాలకే పరిమితం కావడమే ఇందుకు కారణం.












Click it and Unblock the Notifications