MH Elections: బీజేపీపై రాజ్ థాక్రే పొగడ్తలు అందుకేనా ? అసలు విషయం చెప్పిన సంజయ్ రౌత్..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీపై మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే పొగడ్తలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటములకు సమాన దూరం పాటిస్తానంటూ చెప్పి ఇప్పుడు బీజేపీని ఆయన ఎందుకు పొగుడుతున్నారనే దానికి ఉద్ధవ్ శివసేన నేత సంజయ్ రౌత్ కారణం చెప్పారు.
ఈసారి ఎన్నికల తర్వాత బీజేపీ, ఎంఎన్ఎస్ దగ్గరవుతాయని, బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై శివసేన ఉద్ధవ్ వర్గం మండిపడింది. రాజ్ థాక్రే వ్యాఖ్యలకు గల కారణాన్ని సంజయ్ రౌత్ బయటపెట్టారు. కుమారుడు అమిత్ థాక్రే ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని మాహిమ్ సీటు నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన గెలుపుకు బీజేపీ మద్దతు ఆశిస్తున్న రాజ్ థాక్రే అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసారని రౌత్ వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు బీజేపీని మహారాష్ట్ర నుంచి తరిమేయాలని, మోడీ, అమిత్ షాలను రాష్ట్రంలోని రానివ్వకూడదని సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్ థాక్రే ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడం వెనుక మర్మాన్ని అందరూ అర్దం చేసుకుంటున్నారని సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న తన కుమారుడి కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రౌత్ వెల్లడించారు. ఆయన ఎక్కడ ఓడిపోతారన్న ఆందోళనే దీని వెనుక ఉందన్నారు.












Click it and Unblock the Notifications