వాట్సాప్ ఆగేది 55 నిమిషాలే - బెంగాల్లో అభివృద్ధి 55 ఏళ్లు ఆగిందన్న ప్రధాని మోడీ
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. వచ్చే నెలలో మొదలై ఎనిమిది విడతలుగా సాగే ఈ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు ప్రధాని మోడీ కూడా హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పదేపదే అభివృద్ధిపై వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోడీ ఇవాళ కూడా అదే అజెండా కొనసాగించారు. ఖరగ్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. బెంగాల్లో అభివృద్ధిని ఈ సందర్భంగా ఆయన వాట్సాప్తో పోల్చారు. వాట్సాప్ కేవలం 55 నిమిషాలే ఆగిపోతుందని, కానీ బెంగాల్లో మాత్రం 50-55 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని మోడీ ఆరోపించారు.

గతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన "అబ్ కీ బార్ మోడీ సర్కార్" ట్యాగ్ లైన్ను సవరించి "అబ్ కీ బార్ బీజేపీ సర్కార్" (ఈసారి బీజేపీ ప్రభుత్వం) నినాదాన్ని మోడీ వినిపించారు. ఈ సందర్భంగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నిన్న కేవలం 55 నిమిషాలే ఆగాయని, కానీ బెంగాల్లో అభివృద్ధి మాత్రం 55 ఏళ్లుగా ఆగిపోయిందన్నారు. 70 ఏళ్లుగా సాగిన దోపిడీని బెంగాల్లో రాబోయే బీజేపీ ప్రభుత్వం తుడిచిపెడుతుందని మోడీ హామీ ఇచ్చారు. బెంగాల్లో మాకు ఐదేళ్ల అవకాశం ఇస్తే మీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని మోడీ ఓటర్లకు తెలిపారు. వ్యవసాయం, ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లో మెరుగైన పాలన అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications