మరీ రాష్ట్రపతి ఎప్పుడు అవుతారు.. మోడీకి చిన్నారి ప్రశ్న..
పదేళ్ల చిన్నారి ప్రధానికి మెయిల్ చేసింది. రావాలని పిలుపు రావడంతో ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులను వెంటేసుకుని పార్లమెంట్కు చేరుకుంది. ఎన్నో ప్రశ్నలు అడిగగా.. అన్నింటికీ మోడీ సావధానంగా జవాబు చెప్పాడు. చిన్నారికి ఎన్నో చాక్లెట్లు ఇచ్చాడు. చివరకు మోదీ తాతా.. నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు..? అని ప్రశ్నించి నరేంద్ర మోడీని పగలబడి నవ్వేలా చేసింది. ఏం సమాధానం చెప్పాలో తెలియని మోడీ.. కాస్సేపు అలాగే నవ్వుతూ ఉండిపోయాడు. ఎందుకు నవ్వుతున్నాడో తెలియని ఆ చిన్నారి.. బిక్కమొగం వేసుకుని అలాగే ఉండిపోయింది.

మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ బీజేపీ ఎంపీ. ఆయన తండ్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా అప్పట్లో మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. అయితే, సుజయ్ పాటిల్ కుమార్తె 10 ఏండ్ల అనీష పాటిల్ గత కొన్నాళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలని అనుకుంది. తండ్రికి చెబితే మోదీ చాలా బిజీగా ఉంటారని, అపాయింట్మెంట్ ఇవ్వలేరని నచ్చజెప్పారు. దాంతో తానే మోదీ మెయిల్కు లేఖ రాసింది. 'నేను మిమ్మల్ని నిజంగా కలవాలనుకుంటున్నాను' అని సింపుల్గా లేఖలో తెలిపింది. ఇది చూసిన మోదీ తనను కలిసేందుకు ఆమెను ఆహ్వానించాడు.
పార్లమెంట్ వద్ద సుజయ్ పాటిల్ కనిపించగానే.. ఎక్కడ అనీషా అంటూ ఆరా తీశాడు. అక్కడే ఉన్న అనీషాకు షేక్హ్యాండిచ్చి.. పక్కనే ఉన్న తన చాంబర్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చాడు. ఆ పాప అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. వీరి సంభాషణ 10 నిమిషాల పాటు కొనసాగింది. చివరగా.. మీరెప్పుడు రాష్ట్రపతి అవుతారు మోదీ తాతా..? అని అడగ్గానే.. ఒక్కసారి పడీపడీ నవ్వాడు. పక్కనున్న వారు కూడా మోడీతో జత కలిశారు. వాళ్లెందుకు నవ్వుతున్నారో తెలియని ఆ చిన్నారి.. పాపం బిక్క మొగం వేసుకుని ఉండిపోయింది. ఏమయితేనేం.. మోడీని కలిశానన్న సంతోషంతో ఇంటికి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications