కమల్ కామెంట్స్ : దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా పోయింది
దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను లాక్కుంటున్నారని మక్కల్ నీది మయమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ర్యాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని ఆయన గుర్తుచేశారు. దేశంలోని పరిస్థితుల్లో మార్పు రావాలని కమల్ అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కమల్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్, రూ.10వేల కోట్లతో నిర్మిస్తున్న ఎనిమిది లైన్ల సేలం-చెన్నై గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టులపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. సేలం-చెన్నై ఎక్స్ప్రెస్ వే గురించి ప్రస్తావించగా... అది కావాలో లేదో ప్రజలే నిర్ణయానికే వదిలేస్తున్నట్లు కమల్ చెప్పారు.
ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయిన కమల్ హాసన్... తమిళనాడు రైతులకోసం నీళ్లు ఇవ్వాల్సిందేనని గట్టిగా అడిగినట్లు తెలిపాడు. అయితే కావేరీ జలవివాదం నేపథ్యంలో కమల్ హాసన్, కర్నాటక సీఎం కుమారస్వామిని కలవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది.
తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు ఎయిర్ అంబులెన్స్ ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కమల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆనాటి దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చికిత్స కోసం ఆయన్ను కూడా ప్రత్యేక విమానంలో అమెరికాకు తరలించినట్లు కమల్ హాసన్ గుర్తుచేశారు. అయితే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాత్రం డిఫెన్స్ హెలికాఫ్టర్ను వినియోగించుకునేలా నిర్మలా సీతారామన్ అనుమతి ఎలా ఇస్తారని గట్టిగా ప్రశ్నిస్తూ ఆమె రక్షణశాఖ మంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.