గాంధీకి ‘మహాత్మ’ బిరుదు ఇచ్చింది ఠాగూర్ కాదట!
అహ్మదాబాద్: గాంధీకి ‘మహాత్మ' బిరుదును ఇచ్చింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం అది వాస్తవం కాదంటోంది. సౌరాష్ట్రకు చెందిన గుర్తుతెలియని విలేఖరి(జర్నలిస్ట్) ఒకరు ఆ బిరుదును ఇచ్చారని చెబుతోంది. కాగా, ఈ అంశం ప్రస్తుతం గుజరాత్ హైకోర్టును చేరింది.
వివరాల్లోకి వెళితే.. రాజ్కోట్ జిల్లా పంచాయతీ శిక్షణ్ సమితి.. రెవెన్యూ శాఖలో ఒక పోస్టుకు పరీక్ష నిర్వహించింది. ‘మహాత్మ బిరుదును గాంధీకి మొదట ఇచ్చింది ఎవరు?' అనే ప్రశ్నను ఇచ్చారు. పరీక్ష అనంతరం విడుదల చేసిన తొలి ‘కీ'లో ఈ ప్రశ్నకు ‘ఠాగూర్'ను సరైన సమాధానంగా అధికారులు పేర్కొన్నారు.

తుది ‘కీ'లో దాన్ని ‘గుర్తుతెలియని విలేఖరి'గా మార్చారు. దీనిపై సంధ్యా అనే అభ్యర్థిని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సౌరాష్ట్ర జిల్లాలోని జెత్పూర్ పట్టణానికి చెందిన ఒక విలేఖరి గాంధీకి మహాత్మ బిరుదును ఇచ్చినట్లు జాతిపిత కార్యదర్శి మహదేవ్ దేశాయ్ కుమారుడు నారాయణ్ దేశాయ్ రాసిన ఆత్మకథను రాజ్కోట్ జిల్లా పంచాయతీ శిక్షణ్ సమితి కోర్టులో ఉదహరించింది.
దేశాయ్ పుస్తకం ఆధారంగా ఆ ప్రశ్నను తయారు చేశారని వివరించారు. 1916లో గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా.. సదరు విలేఖరి ఆయనను మొదటిసారిగా ‘మహాత్మ' అని సంబోధించారని నారాయణ్ దేశాయ్ పేర్కొన్నట్లు తెలిపారు. ఆ తర్వాతే ఠాగూర్ అలా పిలిచారని చెప్పారు. కాగా, కోర్టు ఈ అంశంపై ఫిబ్రవరి 26న విచారించనుంది.












Click it and Unblock the Notifications