కాన్పూర్ బైరవ్ ఘాట్ శ్మశానంలో తీసిన ఒక ఫోటో వైరల్ ఎందుకైంది... ఫోటోగ్రాఫర్ అరుణశర్మ అనుభవం ఏంటి?
పైన నీలంగా ఉన్న ఆకాశం, కింద వరసగా మండుతున్న చితి మంటలు. ఆ మంటల నుంచి దట్టంగా పైకెగసి పోతున్న పొగ ఆకాశ నీలాన్ని కమ్మేసింది.
గురువారం కాన్పూర్లోని భైరవ్ ఘాట్ శ్మశానంలో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానవ విషాదం ఎంత తీవ్రంగా ఉందో దీనిని చూసి ప్రజలు అంచనా వేయగలుగుతున్నారు.
https://twitter.com/ARUNSHARMAJI/status/1385439504136237067
ఈ ఫొటోను పీటీఐ ఫొటోగ్రాఫర్ అరుణ్ శర్మ తీశారు. ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేసారు. ఇవి ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యాయి.
"నేను ఆ ఫొటో తీసినప్పుడు అక్కడ 38 చితులు మండుతున్నాయి. అక్కడున్న వారు కొన్ని చితులను నీళ్లు చల్లి ఆర్పుతున్నారు" అని అరుణ్ శర్మ చెప్పారు.
https://twitter.com/ARUNSHARMAJI/status/1386703957448282112
ఆ ఘాట్లో కోవిడ్ మృతులనే దహనం చేస్తున్నారు. అక్కడ వరసగా తగలబడుతున్న చితి మంటల సెగకు చుట్టుపక్కల చెట్లు కూడా మాడిపోయాయి.
అరుణ్ శర్మ 15 ఏళ్లుగా ఫొటో జర్నలిజంలో ఉన్నారు.
https://www.instagram.com/p/COFBJv3lslD/?utm_source=ig_embed
"నేను ఎన్నో పెద్ద పెద్ద విషాదాలు కవర్ చేశాను. కానీ, ఇలాంటివి ఎప్పుడూ చూళ్లేదు. అక్కడ నేను చూసినవి నా మనసు నుంచి ఇప్పుడప్పుడే చెరిగిపోవు" అన్నారు.
ఏప్రిల్ 16న దిల్లీ నుంచి కాన్పూర్ చేరుకున్న అరుణ్ శర్మ ఆస్పత్రులు, శ్మశాన ఘాట్ల దగ్గరకు వెళ్లి చాలా ఫొటోలు తీశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఆయన కరోనా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి ప్రయత్నించారు.
"నేను పగలు కూడా శ్మశానానికి వెళ్లాను. అక్కడ పరిస్థితి సరిగా లేదని నాకనిపించింది. ఇంతకు ముందు శవాలను పగలు మాత్రమే తగలబెట్టేవారు. కానీ, తర్వాత రాత్రి కూడా దహనాలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. సాయంత్రం స్థానిక జర్నలిస్ట్ ఒకరు నాకు శవాలు తగలబెడుతున్న వీడియో పంపించారు" అని అరుణ్ అన్నారు.
https://www.instagram.com/p/COGJKtTFygI/?utm_source=ig_embed
"ఆ రోజు సాయంత్రం నేను శ్మశానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడ ఘాట్ బయట పది-పన్నెండు శవాలు ఉన్నాయి. లోపల 38 చితులు మండుతున్నాయి. ఆ చితిమంటల పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఆ దృశ్యం చూడగానే భయమేసింది" అన్నారు.
"అక్కడ ఎంత వేడిగా ఉందంటే, నిలబడడం కూడా కష్టంగా ఉంది. చితి మంటల వేడికి శరీరం కాలింది. మన లోపల ఏదో మండుతున్నట్టు అనిపించింది. మనిషి శరీరంలో కాల్షియం ఉంటుంది. చితుల్లో అది కాలడంతో అక్కడంతా చాలా దుర్గంధం వ్యాపించింది. తెల్లటి పొగలు వచ్చాయి"
https://www.instagram.com/p/CN-UzWSFmNy/?utm_source=ig_embed
ఆ సమయంలో అక్కడ ఆ శవాలను తీసుకొచ్చిన వాళ్లు మాత్రమే ఉన్నారు. ఇంకెవరూ లేరు. శ్మశానంలో 12 మంది పనిచేస్తున్నారు. వారిలో అప్పుడు నలుగురు ఆ చితులను తగలబెడుతున్నారు" అని అరుణ్ శర్మ తెలిపారు.
కరోనా వల్ల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నా అరుణ్ శర్మ, మరికొందరు జర్నలిస్టులు బయటకు వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏ జరుగుతోందో తమ ఫొటోల ద్వారా ప్రజలకు చెబుతున్నారు. కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో జర్నలిజం విధులు నిర్వహిస్తున్న ఆయనకు భయం లేదా?
https://www.instagram.com/p/COKxdNJl3lb/?utm_source=ig_embed
సమాధానంగా ఆయన "నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి పనిచేయడం లేదంటే.. పారిపోవడం.. నేను పారిపోవడానికి బదులు పనిచేయాలనే అనుకున్నా. శవాల పొటోలు తీసుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇంత మంది ఒకేసారి చనిపోవడం సాధారణంగా జరగదు. ఫొటోలు తీస్తున్న సమయంలో నా మనసులో ఎంత కల్లోలంగా ఉందో మాటల్లో చెప్పలేను" అన్నారు అరుణ్ శర్మ
"సాధారణంగా మేం కార్యక్రమాలు, ప్రదర్శనలు లాంటివి కవర్ చేస్తుంటాం. ప్రెస్ కాన్ఫరెన్స్లకు వెళ్తాం. ఒకేసారి ఇన్ని శవాలను ఎప్పుడూ చూడం. మాపై ఈ ప్రభావం అలాగే ఉండిపోతుందనేది మాత్రం కచ్చితం. ఒకే రోజు 250 శవాలు కాలుతుండడం చూడడం అనేది మా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది" అన్నారు.
https://www.instagram.com/p/CNtnLePFicd/?utm_source=ig_embed
కాన్పూర్లో అరుణ్ శర్మ తీసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాక, ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక వార్తా పత్రికల వివరాల ప్రకారం కాన్పూర్ శ్మశానాల్లో 476 చితులు మండిన రోజు ప్రభుత్వ అధికారిక లెక్కల్లో ఆరుగురు మాత్రమే చనిపోయారని ఉంది.
- కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది
- ఇంట్లోనూ మాస్క్ ధరించడం వల్ల ఫలితం ఉంటుందా.. 24 గంటలూ మాస్క్ ధరించడం సాధ్యమేనా
అసలు లెక్కలు దాచేస్తున్నారా
"వాస్తవ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, అది చెబితే ప్రజలు భయపడిపోతారు" అని పేరు రాయద్దని కోరిన ఒక సీనియర్ అధికారి బీబీసీకి చెప్పారు.
"వాస్తవం ఎంత భయం కలిగించేది అయినా, దాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే మా పని. మా ఫొటోల ద్వారా మేం ఈ సమయాన్ని చరిత్రలో నమోదు చేస్తున్నాం. ప్రజలు మా ఫొటోలతో ఈ గణాంకాలతో పోల్చి చూస్తారు. వాస్తవం ఏంటో తెలుసుకోగలుగుతారు" అంటారు అరుణ్.
పరిస్థితి తీవ్రతను, భయానక స్థితిని మనం అంగీకరించకపోతే, మనం దానిని ఎదుర్కోలేం. మా ఫొటోలు అదే నిజాన్ని ప్రజల ముందు ఉంచాయని నాకు అనిపిస్తోంది" అన్నారు.
"మరో విషయంలో కూడా ఈ మహమ్మారి విషాదమే అని చెప్పవచ్చు. ఎందుకంటే జనం తమ వారిని కోల్పోవడమే కాదు, మానవత్వం మీద ఉన్న నమ్మకం కూడా పోయేలా వారికి కొన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి"
తమ ఆప్తుల శవాలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని, వారికి సంబంధించిన వస్తువులు ఏవీ ఇవ్వడం లేదని ఆస్పత్రుల దగ్గర ఎంతోమంది మాకు చెబుతున్నారు. అడ్మిట్ చేసిన సమయంలో రోగులు వేసుకున్న చెయిన్లు, ఉంగరాలు లాంటి ఆభరణాలు శవాలపై లేవని అంటున్నారు.
అరుణ్ గత ఒక వారం నుంచీ కాన్పూర్లోని ఆస్పత్రులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు, శ్మశానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
"ఈ మహమ్మారికి సంబంధించిన పూర్తి వాస్తవాలు ఇప్పటికీ బయటకు రావడం లేదు. ఆస్పత్రుల బయట జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు" ఆని ఆవేదన వ్యక్తం చేశారు అరుణ్ శర్మ.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: 'రిపోర్టులన్నీ నార్మల్గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)