పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని బైడెన్ ఎందుకు అన్నారు?
అమెరికా పార్లమెంట్కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు గురువారం రాత్రి డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్ గురించి కూడా వ్యాఖ్యానించారు.
బైడెన్, అమెరికా అధ్యక్షుడు అయ్యాక పలు దేశాల్లో రైట్ వింగ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాంటి చాలా దేశాలకు అమెరికాతో సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది.
నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిరంకుశత్వం, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడారు.
లాస్ ఏంజిల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో బైడెన్, పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అని అన్నారు. ''నాకు తెలిసి బహుశా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. బాధ్యతలేని ఈ దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నాయి'' అని బైడెన్ అన్నారు.
బహిరంగ సభలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే టెలివిజన్ సైంటిస్ట్ బిల్ నాయి, ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ ఉన్నారు.
https://twitter.com/MediaCellPPP/status/1581249361534627840
అమెరికా రాయబారితో చర్చించనున్న పాకిస్తాన్
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను విలేఖరులు ప్రశ్నించారు.
దీని గురించి పాకిస్తాన్లోని అమెరికా రాయబారితో మాట్లాడనున్నట్లు భుట్టో చెప్పారు.
అమెరికా నుంచి దీనికి సంబంధించిన అధికారిక స్టేట్మెంట్ను పాక్ తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
''ప్రధానితో చర్చించిన తర్వాత అమెరికా రాయబారిని పిలిపిస్తాం. ఆయన ద్వారా అమెరికా అధికారిక ప్రకటన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అనేక విషయాల్లో మాకంటూ ఒక దృక్పథం ఉంది. అమెరికాకు కూడా తన సొంత కోణం ఉంటుంది. కానీ, మీరు ఒక బాధ్యతాయుతమైన దేశంగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఏకీభవించడం, మరికొన్ని విషయాల్లో విభేదించడం జరుగుతుంది'' అని భుట్టో అన్నారు.
- చైనాకు అమెరికా మీద ఎందుకంత కోపం... అసలేమిటీ తైవాన్ వివాదం?
- అమెరికా: జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్టాప్లో ఉన్న రహస్యాలేంటి, ఏమిటీ వివాదం?
బైడెన్ ఏమేం అన్నారు?
ప్రపంచంలో తాజా పరిణామాల గురించి బైడెన్ మాట్లాడారు. ''
"ప్రపంచం మారుతోంది. చాలా వేగంగా మారుతోంది. పరిస్థితి అదుపు తప్పింది. ఎవరో ఒక వ్యక్తి, ఒక దేశం దీనికి కారణం కాదు. ప్రతీ ఒక్కరూ ఈ ప్రపంచంలో తమ స్థానం, భాగస్వామ్యం, సహకారం గురించి పునరాలోచిస్తున్నారు.
అంతర్జాతీయంగా చూస్తే, ఒకేసారి చాలా విషయాలు జరుగుతున్నాయి. సాంకేతికత పరంగా చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పు వచ్చింది. నిజం అనేది ప్రజలకు ఎలా చేరుతోంది?
నిజాన్ని, అబద్ధాన్ని ప్రజలు ఎలా వేరు చేసి చూడగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోంది. మనల్ని ఎలా ఎదుర్కోవాలా అని శత్రువులు కూడా మనవైపే చూస్తున్నారు.
నాటో, యూరోపియన్ యూనియన్కు చెందిన సభ్యదేశాల ప్రముఖులతో శత్రువులు 225 గంటల ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించినట్లు మా సిబ్బంది లెక్కించి మరీ చెప్పారు.
నాటోను అస్థిరపరిచేందుకు పుతిన్ ప్రయత్నించారు. నాటో తూర్పు ఫ్రంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? పోలాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. ఇటీవల స్పెయిన్, ఇటలీలో ఏం జరిగిందో చూడండి.
1946 తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొంది. కానీ, నేటి ప్రపంచం పూర్తిగా భిన్నమైనది.
షీ జిన్పింగ్తో నేను మాట్లాడినంత సమయం అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు కూడా మాట్లాడి ఉండకపోవచ్చు. నేనూ, ఆయన 78 గంటలు కలిసి ఉన్నాం. జిన్పింగ్తో కలిసి 17 వేల మైళ్ల దూరం ప్రయాణించాను.
తనకు ఏం కావాలో జిన్పింగ్కు బాగా తెలుసు. దీనితోనే పెద్ద సమస్య ముడిపడి ఉంది. ఆయనను ఎలా హ్యాండిల్ చేయాలి? రష్యాలో జరుగుతోన్న వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్తాన్ అని నాకు అనిపిస్తోంది. ఒక బాద్యతలేని దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నాయి'' అని బైడెన్ ప్రసంగించారు.
తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్
బైడెన్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ నుంచి ఘాటు స్పందనలు వచ్చాయి.
పాకిస్తాన్ అణ్వాయుధ దేశంగా మారిన తర్వాత ప్రపంచంపై తన దూకుడు వైఖరిని ఎప్పుడు ప్రదర్శించిందో చెప్పాలంటూ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.
అమెరికా చేసిన ప్రకటనతో పాకిస్తాన్లోని 'ఇంపోర్టెట్ గవర్నమెంట్' విదేశాంగ వైఫల్యం బహిర్గతమైందని ఆయన ట్వీట్ చేశారు.
https://twitter.com/ImranKhanPTI/status/1581202524702658562
https://twitter.com/ImranKhanPTI/status/1581202528146165764
పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ నాయకుడు అసద్ ఉమర్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు.
''ఐకమత్యం లేని దేశానికి అణ్వాయుధాలా? ఈ వ్యాఖ్య అమెరికాను ఉద్దేశిస్తూ బైడెన్ అని ఉండొచ్చు? గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. సొంత ఇంటిని అద్దాలతో కట్టినవారు, ఇతరుల ఇళ్లపై రాళ్లు రువ్వకుండా ఉండాల్సింది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
https://twitter.com/Asad_Umar/status/1581139950535249920
భారత్లో పాక్ రాయబారిగా వ్యవహరించిన అబ్దుల్ బాసిత్ కూడా బైడెన్ వ్యాఖ్యపై విచారం వ్యక్తం చేశారు.
https://twitter.com/abasitpak1/status/1581185558461616128
''పాక్ అణ్వాయుధాల కార్యక్రమంపై బైడెన్ చేసిన ప్రకటన చాలా విచారకరం. నిజం చెప్పాలంటే నేడు పాకిస్తాన్తో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ అస్థిరత ఉంది. ఆయన సంతకం చేసిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహం-2022కి కూడా ఇంకా అక్కడ మద్దతు లభించలేదు'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పీటీఐ నేత షిరీన్ మజారీ కూడా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యను ఖండించారు.
''ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ముందు అమెరికా తనను తాను విశ్లేషించుకోవాలి. ఒక అస్థిరమైన అణు సూపర్ పవర్, ప్రపంచంలోని ఇతర దేశాలకు తీవ్రమైన ముప్పు అని'' ట్వీట్ చేశారు.
పీటీఐ మరో నాయకుడు చౌధరి ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేస్తూ, "కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియా గురించి, ఇప్పుడు పాకిస్తాన్ గురించి అమెరికా చేసిన ప్రకటనలు చూస్తే , అమెరికా అధ్యక్షుడు ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బైడెన్ వెంటనే మీ బాధ్యతారహిత ప్రకటనను ఉపసంహరించుకోండి. ప్రస్తుతం మా దేశ నాయకత్వం బలహీనంగా ఉండవచ్చు. కానీ, ప్రజలు బలహీనంగా లేరు'' అని అన్నారు.
https://twitter.com/fawadchaudhry/status/1581154804595757056
''హిరోషిమా, నాగసాకీలను అణు బాంబులతో నాశనం చేసింది ఎవరు? పాకిస్తానా లేక అమెరికానా? ఇందులో అత్యంత ప్రమాదకరమైన దేశం ఏది? బైడెన్ దీనికి సమాధానం ఇస్తారా?" అని పాకిస్తాన్ జర్నలిస్ట్ హామిద్ మీర్ ట్వీట్ చేశారు.
https://twitter.com/HamidMirPAK/status/1581147213161721856
బైడెన్ వ్యాఖ్యల అనంతరం పాకిస్తాన్లో 'బైడెన్' పేరు ట్రెండింగ్లో నిలిచింది. బైడెన్ పేరుతో 5.5 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి.
- భారత్-పాకిస్తాన్: కార్గిల్ సరిహద్దుల్లో అంతులేని నిరీక్షణ, సొంతవాళ్లను కలుసుకునే మార్గమే లేదా?
- సీఐఏ సీక్రెట్ మ్యూజియం: సద్దాం హుస్సేన్ లెదర్ జాకెట్, ఒసామా బిన్ లాడెన్ ఇల్లూ ఇక్కడ ఉంటాయి
వైట్ హౌస్ వివరణ
బైడెన్ వ్యాఖ్యల తర్వాత వైట్ హౌస్ అందులో కొన్ని అంశాలపై వివరణ ఇచ్చింది.
వైట్హౌస్ ప్రతినిధి కెరీన్ జీన్-పియర్ విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా, ఆసక్తిగా ఉందని ఇటలీని ఉద్దేశిస్తూ ఆయన అన్నారు.
ఇటలీ ప్రజల ప్రజాస్వామ్య కాంక్షను అమెరికా గౌరవిస్తుందని చెప్పారు.
అదే సమయంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ''అణ్వాయుధాలను ఉపయోగించబోతున్నట్లు పుతిన్ నుంచి ఎటువంటి సూచనలు అమెరికాకు అందలేదు. అధ్యక్షుడి వ్యాఖ్యలు, ఎలాంటి అంచనాలకు సంబంధించినవి కావు'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'శారీరక శక్తి కన్నా మెదడు ప్రమాదకరం' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు
- కాంతార మూవీ రివ్వూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్
- ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి
- ఎలుకలు, ఎముకలు, బంకమట్టి, నాగజెముడు పండ్లు...ఆకలికి తట్టుకోలేక వీళ్లు ఇవే తింటున్నారు
- కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)