తమిళనాట ఐటీ దాడుల కలకలం: మమత ఆగ్రహం, రాహుల్ బాంబుపై కేజ్రీ
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటి పైన ఆదాయపన్ను దాడి అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటి పైన ఆదాయపన్ను దాడి అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఓ రాష్ట్రంలోని అధికారి అవినీతికి పాల్పడితే కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు.
గతంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇంటిపై దాడులు చేసి ఆయన్ని వేధించారన్నారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపై దాడులు చేస్తున్నారన్నారు. ఎందుకు ఈ ప్రతీకార, అనైతిక చర్యలు? దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఇది నాశనం చేసినట్లేనన్నారు.
ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో వారిపై, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇళ్లపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. అవినీతిని గట్టిగా వ్యతిరేకించాల్సిందేనని, కానీ బాధ్యత గల ప్రభుత్వాధికారి ఇంటిపై దాడులు చేయాలంటే అందుకు సరైన విధానం అవలంబించాలన్నారు.
ఆయనకు వ్యతిరేకంగా కచ్చితమైన సమాచారం దొరికితే రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించి అనంతరం విచారణ జరపాలన్నారు. కానీ ఇలా దాడులు చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని, ఇది సరికాదన్నారు. తన పైన రాజకీయ కక్ష ఉంటే తనను అరెస్టు చేసి కక్ష తీర్చుకోవచ్చునని చెప్పారు.
రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలపై కేజ్రీవాల్
ప్రధాని మోడీపై ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై క్లీన్ చిట్ వచ్చే వరకు ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ ప్రధాని పైన తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
పూర్తి ఆధారాలతో ఐటీ దాడులు
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారుల దాడులను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. బలమైన ఆధారాలతోనే రామ్మోహన్ రావుపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారి అయినంత మాత్రాన సోదాలు చేయకూడదని ఎక్కడా లేదన్నారు.