దమ్ముంటే ఆ పనిచేయండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్..
Recommended Video
పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక్కడి చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు.. గత 70 ఏళ్లుగా పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పొరుగుదేశాల నుంచి శరణార్థులుగా వలసొచ్చిన మైనారిటీలను రక్షించడం,వారికి మద్దతుగా నిలవడం భారత సాంస్కృతిక,జాతీయ బాధ్యత అన్నారు. గురువారం కర్ణాటకలోని సిద్దగంగ మఠాన్ని సందర్శించిన సందర్భంగా మోదీ మాట్లాడారు.

ప్రతిపక్షాలకు మోదీ సవాల్.. :
పార్లమెంట్ చేసిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ఇక్కడి ప్రతిపక్షాలకు తానొక విషయం చెప్పదలుచుకున్నానని
మోదీ అన్నారు. పాకిస్తాన్ దుర్మార్గాలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. మీకు నిజంగా దమ్ముంటే.. నిజంగా నిరసన తెలపాలనుకుంటే.. గత 70 ఏళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాలపై గొంతెత్తాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు తెలపండి..:
మీకు గట్టిగా నినదించాలని ఉంటే.. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినదించాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ అన్నారు. అలాగే ర్యాలీలు గనుక చేయాలనుకుంటే.. అక్కడ అణచివేతకు గురై శరణార్థులకు ఇండియాకు వచ్చిన దళితులకు మద్దతుగా ర్యాలీలు చేయండని అన్నారు. రోడ్లపై ధర్నాలు చేయాలనుకుంటే.. పాకిస్తాన్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని అన్నారు.

పార్లమెంటునే ధిక్కరిస్తున్నారు.. :
వాళ్లకు బీజేపీపై ఉన్న ద్వేషం.. ఈ మధ్య కాలంలో పార్లమెంటు విషయంలోనూ కనిపిస్తోందని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ అన్నారు. దేశ పార్లమెంటును వ్యతిరేకిస్తూ వారు నిరసనలకు దిగుతున్నారని అన్నారు. దళితులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్లో అణచివేతకు గురై శరణార్థులుగా భారత్కు వచ్చినవారికి వ్యతిరేకంగా వారు నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం అని, భారత్ మతాల పేరుతో విభజించపడిన దేశం అని అభిప్రాయపడ్డారు. దేశ విభజన సమయం నుంచి పాకిస్తాన్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. అది హిందూ అయినా,సిక్కు అయినా,జైన లేదా క్రిస్టియన్ అయినా.. ఏ మైనారిటీ అయినా సరే పాకిస్తాన్లో దాడులకు,వివక్షకు గురయ్యారని అన్నారు.

వాటిపై ఎందుకు మాట్లాడరు..
పాకిస్తాన్లో తీవ్ర అణచివేతకు,దాడులకు గురయ్యారు కాబట్టే.. అక్కడి మైనారిటీలు భారత్కు వలసొచ్చారని మోదీ అన్నారు. అలాంటివారిని అక్కున చేర్చుకుంటామంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్ దుర్మార్గాలపై నోరు విప్పని వీరు.. భారత్లో తలదాచుకుంటున్న శరణార్థులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా ఇండియాకు వచ్చినవారిలో ఎక్కువమంది దళితులు,అణచివేతకు గురైనవారే ఉన్నారని అన్నారు. వాళ్లకు చేయూతను అందించడం మన బాధ్యత అని నొక్కి చెప్పారు.












Click it and Unblock the Notifications