యోగి-మోదీ మధ్య చెడిందా...?-యూపీ సీఎంకు ప్రధాని బర్త్ డే ట్వీట్ ఎందుకు చేయలేదు...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజున(జూన్ 5) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎక్కడా ఆయనకు విషెస్ చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య ఏమైనా చెడిందా... ఇటీవలి యూపీ పంచాయతీ ఎన్నికల ఫలితాల ఎఫెక్టే ఇందుకు కారణమా... అని సోషల్ మీడియాలో నెటిజన్లు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
సాధారణంగా ప్రధాని మోదీ పార్టీలకు అతీతంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి పుట్టిన రోజైనా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాంటిది సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి ఆయన విషెస్ చెప్పకపోవడమేంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఇందులో అంతగా ఆరా తీయాల్సిందేమీ లేదని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారని స్పష్టం చేశాయి.

నిజానికి కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ప్రధాని మోదీ ట్విట్టర్లో ఎవరికీ విషెస్ చెప్పట్లేదని పీఎంవో వర్గాలు తెలిపాయి. కేరళ సీఎం పినరయి విజయన్ పుట్టిన రోజు(మే 24),రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పుట్టినరోజు(మే 3),హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పుట్టినరోజు(మే 5),గోవా సీఎం ప్రమోద్ పుట్టినరోజు(ఏప్రిల్ 24)లకు కూడా ప్రధాని ట్విట్టర్లో విష్ చేయలేదని తెలిపాయి.
ఇటీవలి యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి,రామ మందిర నిర్మాణం చేపట్టిన అయోధ్యలో ఆ పార్టీ బోల్తా కొట్టింది. మొత్తంగా ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ కంటే సీట్ల వేటలో వెనుకబడింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు బీజేపీలో అలజడి రేపింది. ఒకవేళ ఈ ప్రభావం 2022 అసెంబ్లీ ఎన్నికలపై పడితే ఎలా అన్న భయం పట్టుకుంది.
Recommended Video
ఈ నేపథ్యంలో యూపీలో నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్ఠానానికి, రాష్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులకు మధ్య జరుగుతున్న వరుస సమావేశాలు ఇందుకు ఊతమిచ్చాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం యోగికి బర్త్ డే విషెస్ చెప్పకపోవడంతో చాలామంది ఈ పరిణామాలను గుర్తుచేసుకున్నారు. కానీ పీఎంవో వర్గాలు తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఈ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి.












Click it and Unblock the Notifications