సమోసా తేలదని భర్తను ఏం చేసిందో తెలుసా..?
ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. చిన్న చిన్న కారణాలకే భర్తలను భార్యలు హతమారుస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక చిన్న సమోసా ఎంత పెద్ద గొడవకు దారితీస్తుందో చెప్పే సంఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. భర్త సమోసా తీసుకురావడం మర్చిపోయాడని ఒక భార్య తన కుటుంబంతో కలిసి అతనిపై, అతని తండ్రిపై దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పిలిభిత్ జిల్లాలోని ఆనంద్పూర్ గ్రామంలో జరిగింది.

ఒక సమోసా.. ఒక పంచాయతీ..
కొంతకాలం క్రితం సంగీత అనే యువతి శివంను పెళ్లి చేసుకుంది. శివం తన భార్య ఏది అడిగినా వెంటనే తెచ్చేవాడు. ఒకరోజు సంగీత సమోసాలు తీసుకురమ్మని కోరింది. అయితే, ఇంటికి వచ్చే హడావిడిలో శివం ఆ విషయం మర్చిపోయాడు. భర్త ఖాళీ చేతులతో ఇంటికి రావడం చూసి కోపంతో రగిలిపోయిన సంగీత, భోజనం చేయడం మానేసి ఈ విషయాన్ని తన పుట్టింటి వారికి తెలిపింది.
సంగీత కుటుంబ సభ్యులు శివం ఇంటికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి పంచాయతీ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పంచాయతీలో మాట మాట పెరిగి, సంగీత కుటుంబ సభ్యులు శివం, అతని తండ్రి విజయ్ కుమార్పై దాడి చేశారు. ఈ గొడవను చూసిన చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
కేసు నమోదు, అరెస్టులు
ఈ ఘటనపై శివం తండ్రి విజయ్ కుమార్ స్థానిక పూర్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంగీత, ఆమె తల్లిదండ్రులు ఉష, రామ్లాది, మామ రామోతర్తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'భార్య మణులు అడిగిందా మాణిక్యాలు అడిగిందా, సమోసానే కదా.. ఎందుకు తీసుకురాలేదు?' అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఒకవైపు వింతగా ఉన్నా, చిన్న విషయాలకు కూడా కుటుంబాల మధ్య గొడవలు ఎలా పెరుగుతున్నాయో ఇది తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications