తెలంగాణ బిల్లు: సభలో బిజెపి ట్విస్ట్ ఇస్తుందా?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష బిజెపి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించడానికి కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం సిద్ధపడింది. బిల్లుకు మద్దతు ఇస్తామంటూనే బిజెపి నాయకులు పలు విధాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని బిజెపి చివరలో ట్విస్ట్ ఇస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
బిజెపి నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడి వంటివారు చేసిన వ్యాఖ్యలు కొంత మేరకు దుమారం రేపాయి. తెలంగాణకు బిజెపి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడిందంటూ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. విభజన తీరును బిజెపి నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెసు విషం చిమ్ముతుండడం వల్లనే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అగ్గి రాజుకుందని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు.
సోమవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో కూడా సుష్మా స్వరాజ్ కాంగ్రెసు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే సభను అడ్డుకుంటుండడాన్ని ఆమె ఆయుధంగా ఎంచుకున్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న ఎంపీలు సస్పెండ్ చేయకుండా తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని సుష్మా స్వరాజ్ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇరు ప్రాంతాల్లో తమ బలాన్ని పెంచుకోవడానికి బిజెపి తెలంగాణ అంశంపై కాంగ్రెసును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఆ పార్టీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. తాము తెలంగాణపై వైఖరి మార్చుకుంటున్నట్లు మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆ వైఖరి ఏమిటో అర్థమవుతోంది.
ఇప్పుడు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని చెప్తే బిజెపికి తెలంగాణలో పూర్తిగా వ్యతిరేకత ఎదురు కావచ్చు. తెలంగాణ అంశంతో కాస్తా బలం పుంజుకున్న ఆ పార్టీ తిరిగి పూర్వస్థితికి వెళ్లి పోయే అవకాశాలుంటాయి. పార్టీలోకి వచ్చిన తెలంగాణ నాయకులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోవడానికి బిజెపి సాహసించకపోవచ్చునని అంటున్నారు.
కాంగ్రెసును ఇరకాటంలో పెడుతూ తెలంగాణ తమ వల్లనే సాధ్యమైందనే ప్రచారం సాగించుకోవడానికి బిజెపి వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర న్యాయం చేయడానికి సవరణలు ప్రతిపాదిస్తామని, సవరణలను ఆమోదించాలని ఒత్తిడి తెస్తామని బిజెపి నాయకులు అంటూనే ఒకవేళ కాంగ్రెసు న్యాయం చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని అంటున్నారు. బిజెపి కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.