ఫేస్బుక్: చంద్రబాబుకు నరేంద్ర మోడీ రిక్వెస్ట్
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకునే అవకాశలున్నాయి. అక్టోబర్ 2న న్యూఢిల్లీలో జరగనున్న మహాత్మా గాంధీ జన్మదిన వేడుకల కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానిస్తూ బిజెపి ఫేస్బుక్ ద్వారా ఒక రిక్వెస్ట్ను పంపింది. అయితే బిజెపి రిక్వెస్ట్ను చంద్రబాబు స్వాగతించి కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది అక్టోబర్ 2న స్పష్టమయ్యే అవకాశం ఉంది.
సుమారు 10ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీని తన మిత్రపక్షంగా చేసుకోవాలని బిజెపి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు.. బిజెపి వెంట వెళతారా లేదా అనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
హిందుత్వ అంశంతో ముందుకు వెళుతున్న మోడీ నాయకత్వంలోని బిజెపి పార్టీకి మద్దతు తెలిపితే వచ్చే లాభ నష్టాలపై చంద్రబాబు అంచనాలు వేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్ర ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కాగా బిజెపితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటాడన్న వార్తలను ఆ పార్టీ ఆంధ్రా ప్రాంత నాయకులు కొట్టిపారేయడం లేదు. తెలుగుదేశం పార్టీని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ)లో చేర్చుకోవడం కోసం నరేంద్ర మోడీ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మోడీని బిజెపి ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించిన నేపథ్యంలో గత జూన్లో ఎన్డీఏ నుంచి జనతా దళ్ యూనైటెడ్(జెడియూ) వైదొలగిలిన సంగతి తెలిసిందె. అయితే ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లపై ఆరోపణల నేపథ్యంలో 2004 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎన్డీఏ కూటమిని నుంచి తప్పుకున్నారు. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బిజెపి ఆహ్వానానికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.