స్వచ్ఛ భారత్లో పాల్గొంటా, కానీ రాజకీయాల్లోకి రాను: సౌరభ్ గంగూలీ
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్లో పాల్గొంటానని అన్నారు. ఐతే రాజకీయాల్లోకి మాత్రం రానని స్పష్టం చేశారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అస్టేలియాలో ఉన్న సౌరభ్ గంగూలీ ఓ టీవీ ఛానల్తో ఫోన్లో మాట్లాడారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్లో పాల్గొంటానని అన్నారు. తన రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని గతంలో చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. గురువారం వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చ భారత్ కార్యక్రమానికి పలువురిని నామినేట్ చేశారు. ఈసారి తాను వ్యక్తిగతంగా, కంపెనీలను స్వచ్ఛ భారత్కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మ, డ్యాన్సర్ సోనాల్ మాన్సింగ్, ఇండియా టుడే చైర్మన్ అరుణ్ పురి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా, ముంబై డబ్బావాలాలను నామినేట్ చేశారు.