200 కోట్ల రూపాయలతో రైతుల కోసం .. అత్యాధునిక పూల, కూరగాయల మార్కెట్.. ఎక్కడంటే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పూలు, కూరగాయల కోసం అతిపెద్ద మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఆధునిక పూలు మరియు కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు 200 కోట్ల రూపాయలను కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో పూలు, కూరగాయల సాగు విస్తీర్ణం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పూలకు ప్రత్యేకమైన మార్కెట్ లేదు. గుడిమల్కాపూర్ మార్కెట్లో కూరగాయలతో పాటు పువ్వులను కూడా విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4402 ఎకరాలలో వివిధ రకాల పూలను, 1.03 లక్షల ఎకరాలలో కూరగాయలను సాగు చేస్తున్నారు ఈ సాగులో మొత్తం 60% రాజధానికి చుట్టుపక్కల జిల్లాల రైతులు చేస్తున్న పరిస్థితి ఉంది.

200కోట్ల రూపాయలతో పూలు, కూరగాయల మార్కెట్
అయితే పూలు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భారీ పూలు, కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 200కోట్ల రూపాయలను కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో పూలు, కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజిజ్ నగర్, హిమాయత్ నగర్ గ్రామాలలో మొత్తం 39ఎకరాల భూమిని ఈ ప్రయోజనం కోసం కేటాయించారు.
బెంగళూరులోని కేఆర్ మార్కెట్ కంటే భారీగా, అధునాతనంగా మార్కెట్
ఇప్పటికే ఈ భూమిని మార్కెటింగ్ శాఖకు బదలాయించి డి పి ఆర్ తయారీ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద పూల మార్కెట్ అయినా బెంగళూరులోని కేఆర్ మార్కెట్ కంటే మెరుగైన సౌకర్యాలతో మరింత అధునాతన ఈ మార్కెట్ ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ మార్కెట్ ను అధికారులు ఇప్పటికే సందర్శించి అధ్యయనం చేశారు.
ఈ జిల్లాల వారికి ఈజీగా రవాణా
కొత్త కూరగాయలు, పూల మార్కెట్లో విశాలమైన భవనాలు, కోల్డ్ స్టోరేజ్ లు, ప్లాట్ ఫారాలు, పార్కింగ్ స్థలాలు మరియ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ అధునాతన మార్కెట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం ఓ ఆర్ ఆర్ కు దగ్గరగా ఉండడం వల్ల రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాల నుంచి రవాణా సులభం అవుతుంది.
రైతులకు ఖుషీ ఖబర్
శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండడం వల్ల ఎగుమతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అధునాతన పూల మరియు కూరగాయల మార్కెట్ ని ఏర్పాటు చేయాలనే ఆలోచన రైతులలో సంతోషానికి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications