పవన శక్తిలో భారత్ విశ్వరూపం: ప్రపంచంలో నాలుగో స్థానం!
స్వచ్ఛమైన ఇంధన వనరుల వేటలో భారతదేశం మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దేశ పవన శక్తి (Wind Energy) సామర్థ్యం 56 గిగావాట్ల మార్కును అధిగమించి కొత్త శిఖరాలకు చేరుకుంది. ఆదివారం నిర్వహించిన 133వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటిస్తూ, దేశం సాధించిన ఈ మైలురాయిని అభినందించారు. ప్రస్తుతం పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించడం విశేషం.
ప్రధాని తన ప్రసంగంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన భద్రత ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. "భారతదేశం ఇటీవల పవన శక్తిలో కీలక మైలురాయిని సాధించింది. గడిచిన ఏడాది కాలంలోనే అదనంగా 6 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించాం. ఇది కేవలం పర్యావరణం గురించే కాదు; మన భవిష్యత్తును సురక్షితం చేయడం గురించి" అని మోదీ వ్యాఖ్యానించారు. విద్యుత్తును ఆదా చేయాలని, స్వచ్ఛమైన శక్తి ఆవిష్కరణల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

2030 నాటికి 100 గిగావాట్లే లక్ష్యం..
కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం పవన శక్తి రంగంలో అత్యుత్తమ ఫలితాలను అందించింది. దేశంలో 150 మీటర్ల హబ్ ఎత్తు వద్ద ఏకంగా 1,164 గిగావాట్ల పవన శక్తి సామర్థ్యం ఉందని అంచనా. ఈ అపారమైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, 2030 నాటికి 100 గిగావాట్లు, 2036 నాటికి 156 గిగావాట్ల లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2070 నాటికి 'నెట్-జీరో' (నికర సున్నా ఉద్గారాలు) లక్ష్యాన్ని సాధించడంలో ఈ రంగం వెన్నెముకగా నిలవనుంది.
గరిష్ట డిమాండ్ వేళ ఆపద్బాంధవి..
పవన శక్తి కేవలం సౌర శక్తికి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, దానికి సరైన తోడుగా నిలుస్తోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు పవన విద్యుత్ ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుతుంది. దేశంలోని మొత్తం పవన విద్యుత్తులో సుమారు 45 శాతం ఉత్పత్తి గరిష్ట డిమాండ్ వేళల్లోనే జరుగుతుండటం ఇంధన వ్యవస్థను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మరో 28 గిగావాట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండటం భారత్ దూకుడుకు నిదర్శనం.














Click it and Unblock the Notifications