కర్ణాటకలో ఎవరు గెలిస్తే.. 2019లో కేంద్రంలోనూ వాళ్లే గెలుస్తారు: రాందేవ్ బాబా
న్యూఢిల్లీ: కర్ణాటక అధికార పీఠం ఏ పార్టీని వరించబోతుందన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోన్న చర్చ. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ 'హంగ్'కే ఛాన్స్ అని చెబుతుండగా.. కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్, బీజేపీలకు పట్టం కట్టాయి.
ఆ రెండు పార్టీలు మాత్రం గెలుపు మాదంటే మాదనే ధీమాతో ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడబోతుండగా.. యోగా గురువు బాబా రాందేవ్ కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపటి ఫలితాల్లో కర్ణాటకలో ఎవరైతే గెలుస్తారో.. 2019లో కేంద్రంలోనూ వారే అధికారంలోకి వస్తారని ఆయన జోస్యం చెప్పారు.
కర్ణాటకలో గెలిచే పార్టీకే 2019లో ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. కాగా, 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన తాజా ఎన్నికల్లో 72.13శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే. గత 2013ఎన్నికల్లో 71.45శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి దాని శాతం పెరగడంతో.. ఏ పార్టీపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Karnataka elections will give a new direction to Indian politics. The winner of Karnataka elections will have the capability of winning elections in 2019: Yoga Guru Ramdev on #KarnatakaElections2018 pic.twitter.com/a8N0g6ce48
— ANI (@ANI) May 14, 2018
అత్యధిక ఓటింగ్ నమోదు కావడంతో.. కాంగ్రెస్ ఒంటరిగానే మెజారిటీ దక్కించుకోవడం ఖాయమని సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా.. పెరిగిన ఓటింగ్ శాతం తమకే లాభిస్తుందని ధీమాగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఓపిగ్గా వేచి చూడాల్సిందే.