అంబేడ్కర్ కూడా అన్లేదు: రాజ్, అమీర్ఖాన్కి కౌంటర్!
న్యూఢిల్లీ: ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దేశం విడితి వెళ్లిపోతానని వ్యాఖ్యానించలేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం నాడు లోకసభలో అన్నారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు కౌంటర్గా భావించవచ్చు.
ఇటీవల అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత రాజ్యాంగం ఆమోద దినం సందర్భంగా అంబేడ్కర్ గౌరవార్థం గురు, శుక్రవారాలు లోకసభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ భారత రాజ్యాంగం కట్టుబాట్ల పైన చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారత్ రాజ్యాంగం స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి ఎనలేనిదన్నారు. భారత్ను సంఘటితం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందన్నారు.
నిష్పక్షపాతంగా, విమర్శలకు తావులేకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని రాజ్నాథ్ చెప్పారు. భారత ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయం వంటిదని, అందుకే రాజ్యాంగంపై చర్చిస్తున్నామని చెప్పారు. భారత జాతిని ఏకదాటిపై నిలిపిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు.
ప్రజాస్వామ్య సంస్థాపనలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కీలక భూమిక పోషించారని చెప్పారు. అంబేడ్కర్ను దళిత వర్గానికి చెందిన నేతగా సంకుచిత దృష్టితో చూడటం సరికాదన్నారు. అనేక జాతీయ సంస్థలు నెలకొల్పేందుకు అంబేడ్కర్ సహకరించారన్నారు.
సమానత్వం కోసం రిజర్వేషన్లను తీసుకు వచ్చిన ఘనత అంబేడ్కర్దే అన్నారు. లౌకికవాదం అనే పదాన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేశాయన్నారు. లౌకిక, సామ్యవాదాలు మనలోనే ఉన్నాయని అంబేడ్కర్ భావించారని చెప్పారు. అందుకే వాటిని రాజ్యాంగ పీఠికలో వాటిని చేర్చలేదన్నారు.
అస్మృశ్యత, అంటరానితనం నిర్మూలనకు అంబేడ్కర్ పాటుపడ్డారన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా దేశం విడిచి వెళ్తానని అంబేడ్కర్ అనలేదన్నారు. రాజకీయ కోణంలో రిజర్వేషన్లు ప్రతిపాదించలేదన్నారు. భారత జాతిని ఐక్యంగా నిలిపే క్రమంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా భయపడలేదన్నారు.
సామాజిక, ఆర్థిక సమానత్వం కోణంలోనే అంబేడ్కర్ రాజ్యాంగం రచించారని చెప్పారు. సర్దార్ పటేల్ ఓ సంఘటిత శక్తి అని, అంబేడ్కర్ అంతా ఏకం చేశారని కొనియాడారు. రాజ్యాంగపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంబేడ్కర్ రిజర్వేషన్లు ప్రతిపాదించారన్నారు. స్వచ్ఛ భారత్ ఓ సామాజిక ఉద్యమం అని చెప్పారు.
భారత్ అత్యంత శక్తిమంతమైన దేశం
భారత్ అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. వ్వవస్థలకు ప్రజా పునాదిలను వేసిన దార్శనికుడు అంబేడ్కర్ అన్నారు. సామాజిక సమానత్వానికి ఆయన పెద్ద పీట వేశారని చెప్పారు.