చైనా 'పైత్యం': ఇండియా వెనక్కి తగ్గిందని, ట్రై జంక్షన్ తమదేనంటూ!
డోక్లామ్ ప్రాంతంలో మోహరించిన సైన్యంలో అత్యధిక భాగాన్ని భారత్ ఉపసంహరించుకుందని, ఇది తమకు లభించిన నైతిక విజయమని చైనా మీడియా పేర్కొనడం గమనార్హం.
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య డోక్లామ్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఊహాజనిత కథనాలను ప్రచురిస్తూ ఇండియాను పరోక్షంగా దెబ్బతీసేలా చైనా వేస్తున్న ఎత్తుగడలు కొనసాగుతూనే ఉన్నాయి. డోక్లామ్ వివాదం మొదలైన నాటి నుంచి చైనా గ్లోబల్ మీడియా ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.
డోక్లామ్లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా
తాజాగా డోక్లామ్ ప్రాంతంలో మోహరించిన సైన్యంలో అత్యధిక భాగాన్ని భారత్ ఉపసంహరించుకుందని, ఇది తమకు లభించిన నైతిక విజయమని చైనా మీడియా పేర్కొనడం గమనార్హం. మరోవైపు భారత్ మాత్రం చైనా వ్యాఖ్యలను ఖండించింది. డోక్లామ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
కాగా, నెల రోజుల క్రితం సుమారు 400 మంది వరకు సైన్యాన్ని భారత్ డోక్లామ్ సరిహద్దులో మోహరించిందని, కానీ ఇప్పుడా సంఖ్య 40కి తగ్గిందని చైనా వెల్లడించింది. దీనికి సంబంధించి బుధవారం నాడు 15పేజీల ఒక స్టేట్మెంట్ ను విడుదల చేస్తూ మ్యాప్స్, ఫోటోగ్రాఫ్ తదితరాలతో డోక్లామ్ వాస్తవ పరిస్థితి ఇదేనంటూ ఒక కథనాన్ని వెలువరించింది.
భారత్ వెనక్కి తగ్గడంతో సిక్కీం, భూటాన్, టిబెట్ ట్రై జంక్షన్ ప్రాంతం తమదేనని మరోసారి స్పష్టమైందని చైనా పేర్కొంది. అంతేకాదు, భారత్ వెనకడుగు వేయడంతో 45రోజుల పాటు కొనసాగిన సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడినట్లు తెలిపింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లి, చైనా జాతీయ సలహాదారు యాంగ్ జీచీతో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.