ఏఐఏడీఎంకేలో మళ్లీ చీలిక? గోడ దూకేందుకు సిద్ధంగా ఎమ్మెల్యేలు! పార్టీపై పట్టుకు టీటీవీ మంతనాలు
అన్నాడీఎంకే (అమ్మ) ఎమ్మెల్యేల్లో మరో 20 మంది టీటీవీ దినకరన్ శిబిరానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడంటే అప్పుడు వారు దినకరన్ వైపు వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని ఆయన మద్దతుదారులు
చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) ఎమ్మెల్యేల్లో మరో 20 మంది టీటీవీ దినకరన్ శిబిరానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడంటే అప్పుడు వారు దినకరన్ వైపు వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని ఆయన మద్దతుదారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వారంతా దినకరన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని, అందువల్ల బేషరతుగా తమ శిబిరానికి రానున్నారని వివరిస్తున్నారు.
రెండాకుల గుర్తుకు ముడుపుల కేసులో బెయిల్పై విడుదలై శనివారం టీటీవీ దినకరన్ చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు నిలిచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అడయారులోని నివాసంలో తన మద్దతుదారులతో టీటీవీ దినకరన్ సుదీర్ఘ మంతనాలు జరిపారు.
మొదలైన మంతనాలు...
తమిళనాడులో ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ టీటీవీ దినకరన్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మంతనాల ద్వారా రాష్ట్ర రాజకీయ సమీకరణాల గురించి ఆయన తెలుసుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
అన్నీ గమనిస్తున్న దినకరన్...
ప్రధానంగా అన్నాడీఎంకే (అమ్మ)లో స్థితిగతులు, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కార్యాచరణలు, తన నాయకత్వంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. టీటీవీ దినకరన్ను కలవబోమంటూ మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలు, తనకు వ్యతిరేకంగా మరికొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలపైనా దినకరన్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది.
ఇప్పటికిప్పుడు అడిగినా...
శశికళ బ్యానర్ల తొలగింపు వ్యవహారంపైనా దినకరన్ గుర్రుగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేల్లో తనకు సానుకూలంగా ఉన్నవారి గురించి దినకరన్ అడిగి తెలుసుకున్నారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు అడిగినా వచ్చేందుకు 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని దినకరన్కు ఆయన మద్దతుదారులు తెలిపినట్టు సమాచారం.
అక్కడ చెప్పారు.. ఇక్కడ...
చెన్నై వెళ్లిన తర్వాత పార్టీ పనుల్లో పాల్గొంటానంటూ ఢిల్లీలో దినకరన్ ప్రకటించడం, ఇక్కడి రాగానే ఆయన చెప్పినట్లుగానే తన మద్దతుదారులతో మంతనాలు జరపడం.. ఇవన్నీ మళ్లీ క్రియాశీలక వ్యవహారాల్లోకి దినకరన్ దిగుతున్నట్టు తెలియజేస్తున్నాయి. పార్టీ వ్యవహారాలు, రాజకీయ క్రీయాశీలక చర్యలు గురించి త్వరలో టీటీవీ దినకరన్ నుంచి కీలకమైన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
మళ్లీ పార్టీపై పెత్తనం కోసం...
ఉప ప్రధాన కార్యదర్శిగా తనను తొలగించే అధికారం శశికళకు మాత్రమే ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా పార్టీకి ఇంకా తానే పెద్దదిక్కు అనే సంకేతాలను ఎడప్పాడి పళనిస్వామి వర్గీయులు, ఇతర రాజకీయ పక్షాలకు దినకరన్ ఇప్పటికే పంపించారు. దీంతో ఇక పార్టీపై పెత్తనం చెలాయించే విధంగా దినకరన్ పావులు కదిపే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
త్వరలోనే కీలక ప్రకటన..?
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యాలయం ఎడప్పాడి పళనిస్వామి వర్గీయుల ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో టీటీవీ దినకరన్ తన పార్టీ కార్యకలాపాలను ఇంటి నుంచే సాగిస్తారా? పార్టీ కార్యాలయాన్ని తన ఆధీనం లోకి తీసుకొచ్చేందుకు వ్యూహ రచన ఏదైనా చేస్తారా? అనే విశ్లేషణలూ రాజకీయవర్గాల్లో బయలుదేరాయి. ఏదేమైనా పార్టీ వ్యవహారాలు, రాజకీయ క్రీయాశీలక చర్యలు గురించి త్వరలో టీటీవీ దినకరన్ నుంచి కీలకమైన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.