లాలూప్రసాద్ యాదవ్ లేకుండా బీహార్ రాజకీయం లేదు!!
ఊహాగానాలు నిజమయ్యాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ భారతీయ జనతాపార్టీతో ఉన్న స్నేహానికి స్వస్తి పలికారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వ్యవస్థాపకుడు లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. లాలూ ఉంటేనే బిహార్ నడుస్తుందని అర్థం వచ్చేలా ఉన్న ఓ పాటను రోహిణి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
లాలూ లేకుండా బిహార్ నడవలేదు అనే భోజ్ పురి పాట వీడియోను ట్విటర్ లో పోస్టు చేసిన రోహిణి ఆచార్య.. పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. లాంతరు పట్టుకొని వస్తున్నారంటూ రాశారు. ఈ ఏడాది బిహార్ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓ ఆర్జేడీ అభ్యర్థి కోసం ఈ పాటను రూపొందించారు. భోజ్ పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ పాటను పాడారు. లాలూ మరో కుమార్తె రాజ్ లక్ష్మీ యాదవ్ కూడా తన తండ్రి, సోదరుడి ఫొటోలను షేర్ చేశారు. తేజస్వీ పాలనను బిహార్ రాష్ట్రం కోరుకుంటోందని రాశారు.
Recommended Video
ఆర్ జేడీతో కలిసి జేడీయూ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అవుతారని, లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ కూడా మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2015లో జేడీయూ-ఆర్ జేడీ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిహార్ అసెంబ్లీలో ఆర్ జేడీకి 79 స్థానాలు, జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19 స్థానాలున్నాయి. మెజారిటీ అవసరమైన స్థానాలు 122. మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 243.