నిండు ప్రాణం బలి-ఆటోలో వెళ్తుండగా మొబైల్ స్నాచింగ్-తిరిగి లాక్కునే క్రమంలో కిందపడి మృతి
ముంబై సమీపంలోని థానేలో దారుణం జరిగింది. ఓ చోరీ ఘటన నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఆటోలో వెళ్తున్న ఓ మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ దొంగతనం చేయగా... దాన్ని తిరిగి లాక్కునే క్రమంలో ఆ మహిళ కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం... థానేలోని ఓ 'స్పా'లో పనిచేసే మహిళ గురువారం(జూన్ 10) రాత్రి 8గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. స్నేహితురాలితో కలిసి ఆమె ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో... బైక్పై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్ను తిరిగి లాక్కునే క్రమంలో ఆమె ముందుకు వంగడంతో ఆటో నుంచి రోడ్డుపై పడిపోయింది.తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఆమె కిందపడ్డ వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతురాలి స్నేహితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల పేర్లు అల్కేష్ పర్వేజ్(20),మొమిన్ అన్సారీ(18)గా తెలిపారు.చోరీ చేసిన మొబైల్ను రికవరీ చేశారా లేదా అన్నది తెలియరాలేదు. గతంలోనూ వీరు మొబైల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
గతంలోనూ చాలాచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖరీదైన ఫోన్లు చేతిలో కనిపిస్తే చాలు స్నాచింగ్ ముఠాలు వాటిని మాయం చేస్తుంటాయి. గతంలో హైదరాబాద్లో ఓ ముఠా ఇలాగే 50కి పైగా ఖరీదైన మొబైల్ ఫోన్లను అపహరించింది. రోడ్డుపై ఖరీదైన ఫోన్తో ఎవరైనా కనిపిస్తే చాలు... రయ్యిమని బైక్పై దూసుకెళ్లడం... అమాంతం ఆ ఫోన్ని ఎత్తుకెళ్లడం ఈ ముఠా పని. చైన్ స్నాచింగ్ ముఠాలే ఇలా మొబైల్ ఫోన్ దొంగతనాల వైపు రూట మార్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఏదేమైనా చేతిలో ఫోన్ పట్టుకుని రోడ్డుపై వెళ్లేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని పోలీసులు చెబుతున్నారు.