ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారడంతో ప్రైవసీ పాలసీ(గోప్యతా విధానం)ను సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం తెలిపింది. ఫేస్బుక్తో డేటా షేరింగ్.. భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
అంతేగాక, వినియోగదారులను ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేయమని చెప్పిందని.. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చే వరకు తాము దీన్ని అమలు చేయమని చెప్పినట్లు పేర్కొంది. తాత్కాలికంగా దీన్ని నిలిపివేస్తూ స్వచ్ఛందంగా అంగీకరించినట్లు తెలిపింది.

ఒకవేళ బిల్లు ఈ పాలసీని అనుమతిస్తే అందుకు తగినట్లుగా వ్యవహరిస్తామని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు ఈ మేరకు వెల్లడించారు. వాట్సాప్ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేంద్రం భావిస్తోందని తెలిపారు.
కాగా, వాట్సాప్ కొత్త పాలసీ ఫిబ్రవరిలోనే అమల్లోకి వచ్చినప్పటికీ.. వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ మే 15న అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పాలసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే, వాట్సాప్ మాత్రం మొండిగా ముందుకు వెళ్లాలని భావించింది.
Recommended Video
అయితే, కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ పాలసీ.. వాట్సాప్ పాలసీ విధానాన్ని అడ్డుకుంది. దీంతో మరోసారి కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదం రాజుకుంది. వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా కోర్టుకు కూడా వెళ్లింది వాట్సాప్ సంస్థ. అయితే, చివరకు తమ పాలసీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్లయింది.












Click it and Unblock the Notifications