World Lion Day 2021: సింహాలకూ ఓ రోజు: ఆ రాజసాన్ని చూడాలంటే ఈ అయిదు చోట్లకు వెళ్లాల్సిందే!
న్యూఢిల్లీ: చరిత్రలో సింహాలకూ ఓ రోజు ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీని ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకొంటారు. సంవత్సరం పాటు సింహాల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేపట్టిన చర్యలను సమీక్షింఛడం, వాటి సంఖ్యను మరింత పెంచడానికి మరో ఏడాది పాటు తీసుకోవాల్సిన నిర్ణయాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంటాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) సింహాలను అంతరించిపోనున్న జాతిగా గుర్తించారు. భారత్లో వాటి సంఖ్య ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతోంది.

ఆసియాటిక్ లయన్స్ డెన్గా
ఆసియాటిక్ సింహాలకు భారత్ పెట్టంది పేరు. ఆ రకం సింహాలకు భారత్ డెన్గా మారింది. ఆసియాటిక్ లయన్ సంఖ్య కూడా భారత్లో అధికమే. గత ఏడాది జూన్లో గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన వన్యప్రాణుల లెక్కల ప్రకారం చూసుకుంటే సింహాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. అయిదేళ్లుగా సింహాల సంఖ్య మెరుగుపడుతూ వస్తోంది. 2015లో 523గా సింహాల సంఖ్య 2020 నాటికి 674కు చేరింది. వాటి సంఖ్య 29 శాతం మేర పెరిగినట్టు గుజరాత్ ప్రభుత్వం.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను అందజేసింది.

దేశంలో ఎక్కడెక్కడ సింహాలను చూడొచ్చంటే..
దేశంలో అయిదు చోట్ల ప్రత్యేకించి సింహాలను సంరక్షించే జాతీయ పార్కులు ఉన్నాయి. సఫారీ చేయడానికీ అవకాశం ఉందక్కడ. ఇందులో మొదటిది శివ్పుర్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఉంటుంది ఈ వైల్డ్లైఫ్ శాంక్చరీ. 133 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాప్తించి ఉన్న ఈ నేషనల్ పార్క్లో సింహాలు స్వేచ్ఛగా తిరుగాడుతుంటాయి. వాటిని చూడటానికి సఫారీ చేసే అవకాశం పర్యాటకులకు కల్పించింది అక్కడి ప్రభుత్వం. దీనితోపాటు కూనో వైల్డ్లైఫ్ శాంక్చరీ కూడా ఇలాంటిదే గ్వాలియర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జాతీయ పార్కుకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.
గుజరాత్లోని గిర్ ఫారెస్ట్..
గుజరాత్లోని గిర్ ఫారెస్ట్.. మరో టాప్ సఫారీ వైల్డ్లైఫ్ శాంక్చరీ. దేశంలో ఉన్న అతిపెద్ద పులుల సంరక్షణ పార్క్గా దీన్ని చెప్పుకోవచ్చు. 1412 చదరపు కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంటుంది ఇది. ఆసియాటిక్ లయన్స్కు కేరాఫ్ అడ్రస్గా మారింది గిర్ ఫారెస్ట్. అడవిలో పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా స్వేచ్ఛగా విహరించే సింహాలను చూడాలనుకునే వారు గిర్ ఫారెస్ట్కు టాప్ ప్రయారిటీ ఇవ్వొచ్చు. వైల్డ్ లైఫ్ ఫొటొగ్రాఫర్లకు లిస్ట్లో గిర్ ఫారెస్ట్ ఎప్పుడూ టాప్ లిస్ట్లో ఉంటుంది.

చిత్తోర్గఢ్లో మరిన్ని
రాజస్థాన్ ప్రతాప్గఢ్, చిత్తోర్గఢ్ జిల్లాల్లో విస్తరించిన సీతామాత సింహాల సంరక్షణ పార్క్కు చెప్పుకోదగ్గదే. సుమారు 423 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నేషనల్ పార్క్లో సఫారీ చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన సింహాల సంరక్షణ పార్కులకు భిన్నంగా ఉంటుందిది. పరిధి తక్కువే అయినప్పటికీ.. ఇందులో అనేక రకాల జీవజాతులు ఉన్నాయి. అరుదైన వన్యప్రాణులు, పక్షులకు నిలయం ఈ పార్క్. ఈ పార్క్ను సంరక్షించడానికి రాజస్థాన ప్రభుత్వం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇదే రాజస్థాన్లో చెప్పుకోదగ్గ మరో నేషనల్ పార్క్.. కుంభల్గఢ్ వైల్డ్లైఫ్ శాంక్చరీ, ఆరావళి పర్వత పంక్తుల మధ్య విస్తరించి ఉంటుంది. లెక్కలేనన్ని రకాల జీవ జాతులు, వన్యప్రాణులు, అంతులేని ప్రకృతి సంపద దీని సొంతం.

వారణాశి సమీపంలో
ఉత్తర ప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాశికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రప్రభ వైల్డ్లైఫ్ శాంక్చరీ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. బర్డ్ వాచర్స్కు ఇదో స్వర్గధామం అని చెప్పుకోవచ్చు. సందర్శకుల తాకిడి అధికంగా ఉండే శాంక్చరీ ఇది. 1958లో దీన్ని సింహాల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వేలాది రకాల పక్షులు విహరిస్తుంటాయి ఇక్కడ. బనారస్ హిందూ యూనివర్శిటీ విద్యార్థులకు ప్రాక్టికల్స్గా కూడా ఉపయోగపడుతుంటుంది ఈ వైల్డ్లైఫ్ శాంక్చరీ. గుజరాత్లోని పోర్బందర్ సమీపంలో ఉన్న బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చరీ కూడా ఇలాంటిదే. బర్డ్ వాచర్స్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్స్ బారులు తీరి నిల్చుంటారు ఈ నేషనల్ పార్క్ను సందర్శించడానికి.

ప్రధాని సందేశం..
ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింహాల సంఖ్య పెరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సింహాలకు భారత్ నిలయంగా మారుతోందని, ప్రతి పౌరుడు కూడా గర్వించాల్సిన విషయమని అన్నారు. ప్రపంచ సింహ దినోత్సవం రోజు అడవికి రాజు వంటి ఆ వన్యప్రాణిపై, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెరుగుతోందని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా భారత్లో సింహాల సంఖ్య పెరుగడాన్ని బట్టి చూస్తోంటే.. వన్యప్రాణుల పట్ల భారతీయులకు ఉన్న మక్కువ ఎలాంటి అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిర్ సింహాలకు సురక్షితమైన ఆవాసాలు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా..
సింహాల సంఖ్య పెరుగుదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. సింహాల సంఖ్య పెరగడం.. అందులోనూ అరుదైన ఆసియాటిక్ లయన్లు వృద్ధి చెందడం హర్షణీయమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అటవీ జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తు చేశారు. వన్యప్రాణులను సంరక్షించడానికి కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మోడీ విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులు, అడవులు, అరుదైన పక్షులు అంతరించిపోవడం వల్ల మానవజాతికి పెను ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కోరారు.












Click it and Unblock the Notifications