Year Ender 2023: విపక్షాల్ని ఇండియా కూటమిగా మార్చిన ఏడాది-విభేదాలతో రాష్టాల్లో షాకులు !
తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను ఈసారైనా గద్దెదింపాలన్న టార్గెట్ తో విపక్షాలు ఈ ఏడాది ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్ధల్ని అడ్డుపెట్టుకుని విపక్షాల్ని అణగదొక్కుతున్న ప్రధాని మోడీని వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో సాగనంపే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమిలో దాదాపు 20కి పైగా పార్టీలు ఉన్నాయి. అయితే ఈ కూటమి అనుకున్న ఫలితాలను సాధించడంలో మాత్రం విఫలమైంది.
జాతీయ స్దాయిలో కాంగ్రెస్, ఆప్ వంటి జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయంగా బలంగా ఉన్న టీఎంసీ, డీఎంకే, జేడీయూ, ఆర్జేడీ వంటి పార్టీలు ఇతర విపక్ష పార్టీల్ని కలుపుకుని ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఆరంభంలోనే ఈ కూటమికి నాయకత్వం ఎవరు వహించాలన్న దానిపై విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఏ పార్టీ ఏకపక్షంగా పగ్గాలు చేపట్టే పరిస్ధితి లేదు. దీంతో తాత్కాలికంగా వీటికి చెక్ పెట్టి ఎన్డీయేను ఓడించే లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆయా పార్టీలు నిర్ణయించుకున్నాయి.

అయితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా ఈ ఏడాది జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఉమ్మడిగా సత్తా చాటడంలో విఫలమయ్యాయి. తాజాగా ఐదు రాష్టాల ఎన్నికల్లో సైతం ఇండియా కూటమి పార్టీలు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో పరస్పరం సహకరించుకోకపోవడం, సీట్ల సర్దుబాటులో విఫలమై పరస్పరం పోటీ చేయడంతో ఆయా రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే తెలిసిపోయింది.
మరోవైపు రాష్ట్రాల్లో మరోసారి వరుస విజయాలతో ఎన్డీయే కూటమి సత్తా చాటుకుంటోంది. గత నాలుగేళ్లలో బీజేపీకి పలు మిత్రపక్షాలు వివిధ కారణాలతో దూరమయ్యాయి. వీటిలో కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరిపోయాయి. అయితే ఇప్పుడు తాజా పరిస్ధితి చూస్తుంటే ఆయా పార్టీలు తిరిగి ఎన్డీయే బాట పట్టినా ఆశ్చర్యం లేదు. అంతెందుకు నిన్న మొన్నటివరకూ అవకాశం దొరికితే విపక్ష కూటమిలో చేరిపోయేందుకు ప్రయత్నించిన టీడీపీ వంటి పార్టీలు సైతం ఇప్పుడు తిరిగి ఎన్డీయేకే మద్దతివ్వాల్సిన పరిస్ధితి నెలకొంది.












Click it and Unblock the Notifications