సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలకు యోగీ కౌంటర్-అది దేశ మతమని వెల్లడి...
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల వేడి ఇంకా తగ్గడం లేదు. జూనియర్ స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పరోక్షంగా స్పందించారు. భారత్ లో సనాతన ధర్మం అనేది ఓ మతమన్నారు.అంతే కాదు సనాతన ధర్మంపై దాడి ఇవాళ్టిది కాదన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉదయనిధి వ్యాఖ్యల్ని తమకి అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా యోగీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
సనాతన ధర్మం భారతదేశం యొక్క జాతీయ మతమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అధికారం కోసం జీవించే వారు దానిని తుడిచివేయలేరన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి దాడికి గురవుతున్న సనాతన ధర్మాన్ని భారతదేశంలో నివసిస్తున్న కొందరు ఇప్పటికీ అవమానించడం దురదృష్టకరమని అన్నారు.

ఇండోర్లోని నాథ్ ఆలయంలో ధ్వజస్తంభం ఆవిష్కరణ కార్యక్రమంలో యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన కాలం నుంచి దాడులకు గురవుతున్న సనాతన ధర్మంలాగే భగవంతుడి ఉనికి, నిజస్వరూపం కూడా ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.
ఈనాటికీ, భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు సనాతన ధర్మాన్ని అవమానించడం దురదృష్టకరమన్నారు. వారు భారతీయ విలువలు, ఆదర్శాలు, సూత్రాలపై దాడి చేసే ఏ అవకాశాన్ని వదులుకోరన్నారు. రావణుడు కూడా భగవంతుని వాస్తవికతపై దాడి చేయడానికి ప్రయత్నించాడని, కానీ ఫలితం ఏమిటని యోగీ ప్రశ్నించారు. రావణుడు తన అహంతో నాశనం అయ్యాడన్నారు.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సనాతన ధర్మాన్ని కరోనావైరస్, మలేరియా, డెంగ్యూతో పోలుస్తూ ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని నాశనం చేయాలన్నారు. మరో డీఎంకే నేత ఎ రాజా సనాతన ధర్మాన్ని కుష్టు వ్యాధి వంటి వ్యాధులతో పోల్చారు. మొఘల్ పాలకుడు బాబర్ అయోధ్యలోని రాముడి ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారని, అయితే 500 ఏళ్ల తర్వాత రామజన్మభూమిలో భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications