హనుమంతుడొస్తున్నాడు..: సిద్ధరామయ్యపై తేల్చేసిన యోగి
Recommended Video
హుబ్లి: కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. పలువురు బీజేపీ నేతలు ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో గురువారం ప్రచారం నిర్వహించారు.
బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప అధ్యక్షతన జరుగుతున్న పరివర్తన ర్యాలీని సీఎం యోగి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.
నైతికతను దెబ్బతీశారు..
గో మాంసం తివచ్చంటూ జాతి నైతికతను దెబ్బతీసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నుంచి మనం ఏమీ ఆశించలేమని యోగి తేల్చి చెప్పారు. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్ర కలిగిన కర్ణాటకలో మొహమ్మద్ అలీ షా, టిప్పు సుల్తాన్ జయంతులను కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు.
హనుమంతొడుస్తున్నాడు..
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు దిగుతున్నారని, పోటీ టిప్పు సుల్తాన్కు హనుమంతుడికి మధ్య ఉంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, అలాంటిది కాంగ్రెస్ మాత్రం ఆయనను పూజించకుండా గత రెండేళ్లుగా టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతుందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య పోరాటయోధుడని అంటోందని.. అలాంటి కాంగ్రెస్ను హనుమంతుడు ఇక ఓడిస్తాడని అన్నారు.
మోడీ అదే చేస్తున్నారు..
జాతీయవాదం, అభివృద్ధిపై కాకుండా కుల, మతాల పేరుతో ప్రజలను విడగొడితే సహించేది లేదని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం అభివృద్ధి, జాతీయవాదంపైనే దృసారిస్తోందని అన్నారు. ఇందుకు గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే నిదర్శనమని యోగి చెప్పారు.
యోగికి మంత్రి కౌంటర్
రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నా.. సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోందని ఆరోపించారు. కాగా, యోగి వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్.. ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల గురించి చూసుకుంటే మంచిదని సూచించారు.