యోగీ సంచలన నిర్ణయం- 2030 నాటికి యూపీలో ప్రభుత్వ వాహనాలన్నీ ఈవీలుగా మార్పు...
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఓవైపు పెట్టుబడుల ఆకర్షణలో పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, మరోవైపు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా యూపీని మార్చేందుకు వీలుగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు.
యూపీలో కాలుష్యాన్ని తగ్గించి, చమురును ఆదా చేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని యోగీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ గా మార్చాలని భావిస్తోంది. 2030 నాటికి దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వాహనాల స్ధానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేసారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా మాట్లాడుతూ.. 2030 నాటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వ వాహనాలను క్రమంగా ఈవీలతో భర్తీ చేస్తామని చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, టెండర్లు లేకుండా ఈవీలను కొనుగోలు చేయవచ్చని శాఖలకు సూచించారు. నామినేషన్, అవసరమైతే ఈవీల కొనుగోలు కోసం ఇప్పటికే ఉన్న గరిష్ట పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చని కూడా వెసులుబాటు కల్పించారు.
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ వాహనాల కంటే ఈవీలు ఖరీదైనవి కాబట్టి వాటి కొనుగోలుపై అదనపు ఖర్చును అనుమతించాల్సిన అవసరం ఉన్నందున ఈ రెండు నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వ ప్రతినిధి తాజాగా వెల్లడించారు. అంతకుముందు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 14, 2022 నుండి వచ్చే మూడేళ్లపాటు రాష్ట్రంలో కొనుగోలు చేసిన అన్ని రకాల కొత్త ఈవీలకు రహదారి పన్ను , రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయించింది. దీంతో పాటు యూపీలో తయారు చేసిన ఈవీలు వచ్చే ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు తీసుకునేందుకు అనుమతిచ్చారు.












Click it and Unblock the Notifications