మీ భోజనం మీరు చేయండి.. మాది మేం తింటాం: కేంద్రమంత్రులకు తేల్చేసిన రైతు ప్రతినిధులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సోమవారం కేంద్రమంత్రులు చర్చలు జరిపారు. చర్చల సమయంలో భోజనం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గత సమావేశాల సందర్భంగా రైతులతో కేంద్రమంత్రులు భోజనం చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
ఈసారి కూడా కలిసే భోజనం చేద్దామని కేంద్రమంత్రులు కోరగా.. అందుకు రైతు సంఘాల ప్రతినిధులు సున్నితంగా తిరస్కరించారు. తాము తెచ్చుకున్న భోజనం తామే చేస్తామని.. మీరు మీ భోజనం చేయండని స్పష్టం చేశారు. దీంతో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, ఎంపీ సోమ్ ప్రకాశ్ వేరుగా భోజనం చేశారు.
సోమవారం ఏడో రౌండ్ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ వైపు రైతు సంఘాల ప్రతినిధులు, మరోవైపు కేంద్రమంత్రులు భోజనం చేయడం కనిపించింది. అయితే, నూతన వ్యవసాయ చట్టాలపై ఇరువర్గాలు కూడా మెట్టుదిగేలా కనిపించలేదు. దీంతో సుదీర్ఘంగా జరిగిన సోమవారం నాటి చర్చ కూడా ఎటూ తేలలేదు.
వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ లను రైతుల లంగర్లో పాల్గొనడానికి ఆహ్వానించారు. మంత్రులు కాయధాన్యాలు, కూరగాయలతో రోటీలు వడ్డిస్తున్నట్లు విజువల్స్ ఉన్నాయి.
కాగా, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని కొనసాగించడంతోపాటు కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రం కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. అయితే, నూతన వ్యవసాయ చట్టాలను మాత్రం రద్దు చేసేది లేదని స్పష్టం చేస్తోంది. దీంతో ఏడో రౌండ్ చర్చలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. దీంతో జనవరి 8న మరోసారి చర్చలు జరపాలని రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్రం నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ సరిహద్దులో నెల రోజులకుపైగా పంజాబ్, హర్యానా రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు.