జోక్యం చేసుకోను: జగన్కు షాక్, హామీ ఇవ్వని మోడీ?
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి ఎలాంటి హామీ లభించలేదని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో సోమవారం మోడీతో జగన్ ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన పైన నమోదైన అక్రమాస్తుల కేసుల గురించి జగన్ ప్రస్తావించారట.
దానికి మోడీ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దుర్వినియోగం కాదని, ఈ విషయంలో ఏ విధంగాను జోక్యం చేసుకోనని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైన ఎంపీలను వెంటబెట్టుకొని సోమవారం ఢిల్లీకి వెళ్లిన జగన్.. మోడీతో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి వినతిపత్రం అందించారు. అనంతరం కొద్దిసేపు మోడీతో విడిగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగానే అక్రమాస్తుల కేసుల గురించి జగన్ ప్రస్తావించారట. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైనే మోడీతో భేటీ కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేసుల అంశం కూడా ప్రస్తావించారట. అందుకే బిజెపితో సంబంధాల విషయంలో జగన్లో మార్పు కనిపిస్తోందని అంటున్నారు.
కాగా, తాను మోడీకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని, అంశాలవారీగా మద్దతిస్తామని జగన్ సోమవారం మోడీతో భేటీకి ముందు చెప్పారు. వెంటనే బిజెపి ఆయనకు షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తాము టిడిపితో పొత్తు పెట్టుకున్నామని, మరొకరి అవసరం లేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.