జీరో ప్లస్ జీరో ఈజ్ జీరో: లాలూ, నితీష్లపై షా, రూపాగంగూలీపై దాడి!
పాట్నా: బీహార్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రచారం ప్రారంభించారు. మొదటి రోజే ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
'నేను లాలూజీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. జీరో ప్లస్ జీరో ఈజ్ జీరో. మీరు నెలకొల్పిన సంకీర్ణం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఏమీ జరగదు' అని అమిత్ షా అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు సవరణలపై అసత్య ప్రచారం చేసి బీజేపీని దెబ్బతీస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'బీహార్లో ఎన్ని చక్కెర మిల్లులు నడుస్తున్నాయో నితీశ్ కుమార్ను అడుగుతున్నా? ఎన్ని మాల్స్ మీ ప్రాంతంలో వచ్చాయో అని ప్రశ్నిస్తున్నా? ఎన్ని రహదారులు మంచి కండిషన్లో ఉన్నాయో చెప్పండి' అంటూ అమిత్ షా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్ని సంకీర్ణాలున్నా త్వరలో బీహార్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఉద్ఘాటించారు.
ఇది ఇలా ఉంటే డా. బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంపై నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందని అన్నారు. వచ్చే ఏడాది బీహార్లో జరగనున్న ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ) కలిసి పోటీ చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేయనున్నాయి.
గత ఏడాది జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో 40 స్ధానాలున్న బీహార్లో బీజేపీ దాని అనుబంధ పార్టీలు 32 స్ధానాలు కైవసం చేసుకున్నాయి. దీంతో ఖంగుతిన్న అప్పటి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత మాంఝీని సీఎంగా నియమించారు. మళ్లీ కొన్ని నాటకీయ పరిస్దితుల్లో గత నెలలో బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ బాధ్యతలను చేపట్టారు.
రూపా గంగూలీపై దాడి!
ప్రముఖ నటి, బీజేపీ నేత రూపా గంగూలీ పైన దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రచారంలో ఉన్న ఆమెపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications