బంగ్లాదేశ్లో బోటు మునక.. 15 మంది రోహింగ్యాల మృతి
రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోవడంతో 15 మంది చనిపోయినట్టు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. దాదాపు 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ బోటు.. సైంట్ మార్టిన్ ఐస్లాండ్ వద్ద మునిగిపోయినట్టు చెప్పారు. ప్రమాదం నుంచి 71 మంది ప్రయాణికులను కాపాడినట్టు చిట్టగాంగ్ డివిజన్ కోస్ట్గార్డ్ కమాండర్,వసీమ్ మక్సూద్ తెలిపారు. మిగతావారు సముద్రంలో గల్లంతు కాగా.. కోస్ట్గార్డ్కి సంబంధించిన ఓ బోటు,రెండు నేవీ ఓడలు ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నాయి.
బోటు ప్రమాదంపై మంగళవారం ఉదయం తమకు సమాచారం అందిందని.. అయితే పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతో.. బోటు ఎక్కడ ఉందో గుర్తించేందుకు చాలా సమయం పట్టిందని మక్సూద్ తెలిపారు.అయితే ఆ బోటు ఎటు వెళ్తుందన్న దానిపై సమాచారం లేదన్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యామని.. అవి పూర్తయ్యాకే మిగతా వివరాలపై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.
మయన్మార్ సరిహద్దులోని దక్షిణ బంగ్లాదేశ్ పరిధిలో ఉన్న కాక్స్ బజార్,లోని టెక్నాఫ్ నుంచి బోటు బయలుదేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అక్కడినుంచి వేలాది మంది రోహింగ్యా శరణార్థులు సముద్ర మార్గం మీదుగా వేరే దేశాలకు తరలిపోయారు. కాక్స్ బజార్లో ఉన్న శరణార్థి శిబిరంలో ఇప్పటికీ చాలామంది రోహింగ్యాలు ఉన్నారు. వారిలో కొంతమంది ఇలా సముద్రమార్గం ద్వారా వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు.