బుల్డోజర్ లతో ... గంజాయి లేడీ డాన్ నీతూబాయికి పోలీసుల దిమ్మతిరిగే షాక్!
హైదరాబాద్లో డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ వ్యాపారాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ ద్వారా పోలీసులు భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్ ప్రాంతాల్లో గంజాయి మాఫియాను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా మారిన లేడీ డాన్ నీతూ బాయికి షాక్ ఇచ్చారు .
నీతూబాయి అక్రమంగా నిర్మించిన కిరాణా షాప్, రేకుల షెడ్ తొలగింపు
నానక్రామ్గూడ లోథా బస్తీలోని ఆమె నివాసం ముందు ఆక్రమించి నిర్మించిన కిరాణా దుకాణం, రేకుల షెడ్ను జేసీబీల సాయంతో పూర్తిగా కూల్చివేశారు. ఈ దుకాణం వెనుకగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించి, అధికారులు ఈ చర్య తీసుకున్నారు. రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలను తొలగించడంతో పాటు సమీప ప్రాంతాల్లోని ఇతర ఆక్రమణలను కూడా అధికారులు తొలగించారు.

నీతూ బాయిపై సుమారు 20కి పైగా కేసులు
ధూల్పేట్కు చెందిన నీతూ బాయి కుటుంబం గతంలో గుడుంబా వ్యాపారం చేసేది. కానీ రాష్ట్రంలో గుడుంబా నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత గంజాయి వైపు మళ్లారు. గత పదేళ్లుగా నానక్రామ్గూడలోని తన ఇంటిని గంజాయి అడ్డాగా మార్చి, కుటుంబ సభ్యులతో కలిసి ఈ అక్రమ వ్యాపారాన్ని నడుపుతోంది. 2017 నుంచి 2024 వరకు ఎన్డీపీఎస్ మరియు ఎక్సైజ్ చట్టాల కింద ఆమెపై సుమారు 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
నీతూ బాయి ఆస్తుల్లో రూ.2 కోట్ల విలువైన వాటిని జప్తు
అనేకసార్లు అరెస్టు చేసి జైలు పాలైనా, ఆమె ఈ దందాను కొనసాగించారు. 2023లో ఒక భారీ గంజాయిని సీజ్ చేసిన కేసులో ఆమెను అరెస్టు చేసి రూ.40 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, 16 బ్యాంక్ ఖాతాల్లో రూ.1.53కోట్లు ఉన్నట్లు గుర్తించి, ఆమె ఆస్తుల్లో రూ.2 కోట్ల విలువైన వాటిని జప్తు చేశారు. 2024లో ఆమె ఇంటిపై జరిపిన దాడుల్లో కూడా పెద్ద మొత్తంలో గంజాయి లభించింది.
నీతూ బాయిని పట్టుకోవటం కోసం పోలీసుల ప్రయత్నం
ఇటీవల ఈగల్ టీమ్ నిర్వహించిన మెరుపు దాడుల్లో 47 మంది వినియోగదారులు పట్టుబడగా, నీతూ బాయి మాత్రం తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఐటీ కారిడార్లో పని చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరియు యువతకు గంజాయి సరఫరా చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కిరాణా దుకాణం మాటున ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్న విషయం ఈగల్ టీమ్ నిఘా ద్వారా బయటపడింది.అప్పటి నుండి నీతూ బాయిని పట్టుకోవటం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications