కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి, అమెరికా రక్షణ కార్యదర్శికి రాకెట్లతో స్వాగతం!?
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బుధవారం ఉదయం రాకెట్ల పేలుళ్లతో దద్దరిల్లింది.
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బుధవారం ఉదయం రాకెట్ల పేలుళ్లతో దద్దరిల్లింది. అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కాబూల్ పర్యటన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.
బుధవారం ఉదయం 11.15 గంటలకు మొదలైన ఈ దాడి సుమారు గంటన్నర పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. 20 నుంచి 30 రాకెట్లు విమానాశ్రయంపై వచ్చి పడ్డాయని స్థానిక మీడియా టోలో న్యూస్ వెల్లడించింది.
అయితే దాడి చేసిన వారి లక్ష్యం ఎయిర్ పోర్ట్ అయి ఉండదని.. నాటో దళాలనే లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దాడిలో ఎవరైనా మరణించారా? ఎంత మంది గాయపడ్డారు? అనే వివరాలు ఇంకా వెల్లడి కావడం లేదు.
భారత పర్యటనలో భాగంగా జేమ్స్ మాటిస్ మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు.
అనంతరం ఆయన అఫ్ఘానిస్తాన్ బయలుదేరి వెళ్లారు. అయితే అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ అప్ఘాన్ పర్యటన గురించి ముందుగా ప్రకటించలేదు. మాటిస్, నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్బర్గ్ ఇరువురూ తొలుత అఫ్ఘానిస్థాన్ లో అమెరికా కమాండర్ జనరల్ జాన్ నిఖోల్సన్ ను కలిశారు.
అనంతరం మాటిస్ అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనితో కూడా సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ టార్గెట్ గానే ఈ దాడి జరిపినట్లు తాలిబన్ సంస్థ ప్రకటించినట్లు స్థానిక మీడియా టోలో న్యూస్ పేర్కొంది.