ఊచకోత: గొంతులు కోసి.. గోతుల్లో పూడ్చిపెట్టి.., మయన్మార్లో ముస్లిం తీవ్రవాదుల అమానుష కాండ
మయన్మార్లో హిందూ రోహింగ్యాలపై జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. ఉత్తర రఖైన్లోని ఖా మౌంగ్ షేక్ అనే చిన్న గ్రామంలో 45 మంది హిందూ రోహింగ్యాల మృతదేహాలను సైన్యం గుర్తించింది.
బంగ్లాదేశ్: మయన్మార్లో హిందూ రోహింగ్యాలపై జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. ఉత్తర రఖైన్లోని ఖా మౌంగ్ షేక్ అనే చిన్న గ్రామంలో 45 మంది హిందూ రోహింగ్యాల మృతదేహాలను సైన్యం గుర్తించింది.
ముస్లిం తీవ్రవాదులు వీరి గొంతులు కోసి.. గోతుల్లో పూడ్చిపెట్టగా, గత వారం రోజులుగా సైన్యం ఈ మృతదేహాలను వెలికి తీస్తోంది. ఖా మౌంగ్ షేక్ గ్రామంలో.. కనిపించకుండా పోయిన మరో 55 మంది కోసం తీవ్ర గాలింపు జరుగుతోంది.

గుంపుగా నిలబెట్టి.. గొంతులు కోశారు..
గతనెల 25వ తేదీన ఉత్తర రఖైన్లోని ఖా మౌంగ్ షేక్ అనే చిన్న గ్రామంలోకి ప్రవేశించిన ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ కార్యకర్తలు మారణకాండ సృష్టించారు. గ్రామస్థులను పట్టుకొని, గుంపుగా నిలబెట్టి గొంతులు కోశారు. ఆ తరువాత సామూహికంగా గోతుల్లో పూడ్చిపెట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే విచక్షణ కూడా లేకుండా తీవ్రవాదులు గ్రామస్థులపై ఊచకోత సాగించారు. ఈ గ్రామానికి బుధవారం మయన్మార్ సైన్యం.. మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని వెళ్లింది.

మహిళలు చూస్తుండగానే ఊచకోత...
‘జాతి శుద్ధి' పేరిట రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో సైనిక చర్య మొదలయిన తరువాత, మీడియాను అనుమతించడం ఇదే తొలిసారి. ఖా మౌంగ్ షేక్ గ్రామానికి చెందిన రీకా ధర్ కన్నీటి పర్యంతమవుతూ జరిగిన ఘోరాలను మీడియాకు వివరించింది. ‘ముసుగులు ధరించిన కొంతమంది మా గ్రామంపై దాడిచేశారు. నా భర్తని, ఇద్దరు సోదరులను, ఇంకా అనేకమంది గ్రామస్థులను పట్టుకొన్నారు. వారిని మా కళ్ల ముందే ఊచకోత కోశారు..'' అంటూ ఆమె విలపించింది.

వంద మందిని కొండల్లోకి తీసుకెళ్లి...
ముస్లిం తీవ్ర వాదులు తన భర్త సహా వందమందిని కొండల్లోకి తీసుకెళ్లి చంపేశారని కోక్స్ బజార్కి చెందిన ప్రొమీల చెప్పింది. ఇలా వందలాదిమంది ఆత్మీయులను కోల్పోయిన 5 లక్షల మందికిపైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు పారిపోయి వచ్చారు. ఏడాది వ్యవధిలో తీవ్రవాదుల చేతుల్లో 163 మంది చనిపోయారని, 91మంది గల్లంతు అయ్యారని మయన్మార్ సైన్యం కూడా ప్రకటించింది.

శరణార్థులపై.. బౌద్ధులు దాడి...
ముస్లిం రోహింగ్యాల ప్రాబల్యం కలిగిన 200 గ్రామాలు కాలిపోగా, 4 లక్షల 20 వేల మంది బంగ్లాదేశ్కు వలస పోయారని మయన్మార్ సైన్యం తెలిపింది. శ్రీలంకలో ముస్లిం రోహింగ్యాలపై మంగళవారం బౌద్ధులు దాడులకు పాల్పడ్డారు. కొలంబో శివార్లలో రోహింగ్యాల కోసం ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న శిబిరం వద్ద బౌద్ధులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఉగ్రవాదులకు శ్రీలంకలో చోటులేదంటూ దాడికి దిగారు. అయితే బౌద్ధుల చర్యను శ్రీలంక ప్రభుత్వం గర్హించింది. రోహింగ్యాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications