5జీ..యమ డేంజర్: విమానాశ్రయాలు, రన్వేల్లో పెట్టొద్దు
వాషింగ్టన్: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న 5జీ టెక్నాలజీ వల్ల కొన్ని విపత్కర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రత్యేకించి- విమానాల భద్రతకు ఇది పెనుముప్పుగా పరిణమిస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పలు పౌర విమానయాన సంస్థల యాజమాన్యాలు 5జీ టెక్నాలజీ పట్ల నిరసనలను తెలియజేస్తోన్నాయి. విమానాశ్రయాలు, రన్వేల్లో దీన్ని అందుబాటులోకి తీసుకుని రావొద్దని విజ్ఞప్తి చేస్తోన్నాయి.
అమెరికాలో 48 విమానాశ్రయాల వద్ద 5జీ ట్రాన్స్పాండర్లను నెలకొల్పడానికి ఆ దేశ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ఏటీ అండ్ టీ, వెరిజోన్ సంస్ధలు వాటిని నెలకొల్పుతున్నాయి. దీన్ని పలు పౌర విమానయాన సంస్థలు వ్యతిరేకించాయి. ఆ దేశ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. దేశంలో ఎక్కడైనా 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టవచ్చని.. విమానాశ్రయాలు, రన్వేలను ఇందులో నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరాయి. రన్వేలకు కనీసం రెండు కిలోమీటర్ల చదరపు వైశాల్యంలో 5జీని ప్రవేశపెట్టవద్దని సూచించాయి.

5జీ సీ బ్యాండ్ ప్రభావం విమానాల భద్రతపై పడుతుందని పౌర విమానయాన సంస్థలు స్పష్టం చేస్తోన్నాయి. 5జీ తరంగాల వల్ల రాడార్లో ఇబ్బందులు తలెత్తితే టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూపీఎస్ ఎయిర్ లైన్స్, అలస్కా ఎయిర్ లైన్స్, అట్లాస్ ఎయిర్, జెట్ బ్లూ ఎయిర్వేస్, ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలకు చెందిన ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు. దాన్ని వైట్హౌస్కు పంపించారు.
విమానాల్లో ఉండే ఆల్టీమీటర్లు 5జీ టెక్నాలజీ ప్రభావానికి గురవయ్యే ప్రమాదం లేకపోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 4.2-4.4 గిగా హెర్ట్జ్పై అల్టీ మీటర్లు పని చేస్తాయని, దీనికి దాదాపు సమానంగా అంటే 3.7-3.98 గిగా హెర్ట్జ్ రేంజ్తో 5జీ స్పెక్ట్రమ్ సీ బ్యాండ్ ఏర్పాటు చేయడం వల్ల అవి ప్రభావితమౌతాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో గాలి వేగాన్ని సైతం అంచనా వేయడం కష్టతరమౌతుందని పేర్కొన్నారు.
ఆల్టిట్యూడ్, ఆల్టీమీటర్ల రీడింగ్స్ సమర్థవంతంగా పని చేయవని, విండ్ షీయర్ను రికార్డు చేయలేవని, ఈ పరిస్థితులు ల్యాండింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయని తమ లేఖలో వివరించారు. దీనివల్ల ల్యాండింగ్, టేకాఫ్లో జాప్యం ఏర్పడే అవకాశాలు లేకపోలేదని, ఫలితంగా కనీసం నాలుగు శాతం మేర విమాన సర్వీసుల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications