దారుణం- వెంటపడి కాల్చి చంపారు: ఆరుమంది మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. గత ఏడాది తరహాలోనే ఇప్పుడు గన్ కల్చర్ అక్కడ చెలరేగింది. ఇష్టారాజ్యంగా తుపాకుల విక్రయాలను నిరోధించడానికి, వాటిని వినియోగించడానికీ జో బైడెన్ ప్రభుత్వం మార్గదర్శకాలు, నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ- ఈ ఘాతుకాలకు బ్రేకులు పడట్లేదు.
తాజాగా సెంట్రల్ కాలిఫోర్నియాలో సంభవించిన కాల్పుల్లో ఆరుమంది మరణించారు. మృతుల్లో- 17 సంవత్సరాల వయస్సున్న తల్లి, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు.

సెంట్రల్ కాలిఫోర్నియా టులారే సమీపంలోని గోషెన్ ప్రాంతంలో ఓ విల్లాలో నివసిస్తోన్న కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అయిదుమంది అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే టులారే కంట్రీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీధిలో రెండు, ఇంటి బయట ఒకటి, బెడ్ రూంలో మూడు మృతదేహాలను గుర్తించామని టులారే పోలీస్ హెడ్ మైక్ బాండ్రెక్స్ తెలిపారు. చోరీ కోసం వచ్చిన వారు ఈ కాల్పులకు పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నారు.
సెమీ రూరల్ ఏరియాగా గుర్తింపు ఉన్న గోషెన్ లో తరచూ నార్కొటిక్స్ సంబంధిత నేరాలు నమోదవుతుంటాయి. గతంలో కూడా డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన ఘర్షణలు సంభవించాయి. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న కాల్పులతో డ్రగ్స్ మాఫియా ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తోన్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications