28 మందితో వెళ్తున్న సముద్రం కుప్పకూలిన విమానం: విమానంలో నగర మేయర్ కూడా
మాస్కో: ప్రయాణికులతో వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన ఘటన రష్యాలో మంగళవారం చోటు చేసుకుంది. 28 మందితో వెళ్తూ గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్లు రష్యన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ గుర్తించినట్లు ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పం వద్ద ల్యాండింగ్కు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఫార్ ఈస్ట్ ప్రాంతంలో పెట్రోపవ్లోస్క్-కామ్చట్క్సీ నుంచి ఉత్తర కామ్చట్కాలోని పలనా గ్రామం వెళ్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో విమానం సంబంధాలు తెగిపోయినట్లు రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ వెల్లడించింది.
ఏఎన్-26 విమానం కూలిపోయిన ప్రాంతానికి స్థలానికి కొన్ని నౌకలు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానంలో 22 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ తెలిపింది. ఈ ప్రయాణికుల్లో పలనా గ్రామ మేయర్ ఓల్గా మొఖిరేవా కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం మేగావృతమై ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. విమాన ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు. విమాన శకలాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. *