పాక్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న ఆప్ఘనిస్తాన్..! భారత్ చూపిన బాటలోనే..!
భారత్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తో పాటు సింధు జలాల్ని నిలిపేసి భారత్ ఇచ్చిన షాక్ కు పాక్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. సింధు జలాల్ని వదలాలంటూ అంతర్జాతీయ కోర్టులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆప్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేసి నిప్పు రాజేసిన పాకిస్తాన్ కు ఆ దేశం గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో భారత్ కు తాలిబాన్లు స్నేహహస్తం అందిస్తున్నారు. దీంతో పాక్ రగిలిపోతోంది.
అదే సమయంలో పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ కు ప్రవహించే కునార్ నదీ జలాల్ని అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి గట్టి గుణపాఠం నేర్పాలని భావిస్తోంది. ఇందుకోసం కునార్ నదిపై ఓ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది. దీన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, పూర్తి చేయడం ద్వారా పాకిస్తాన్ కు ఈ నదీ జలాలు వెళ్లకుండా అడ్డుకోవాలని తాలిబాన్ల సుప్రీం లీడర్ మౌవ్లావీ హిబతుల్లా అఖుంద్ జాదా ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే భారత్ సింధు నదీ జలాలు నిలిపేయడంతో వ్యవసాయంతో పాటు ఇతర అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు ఆప్ఘనిస్తాన్ నిర్ణయం శరాఘాతం కానుంది. కునార్ నదిపై తాలిబాన్లు డ్యామ్ నిర్మాణం ప్రారంభిస్తే పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని , దేశీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ అఖుండ్జాదా మంత్రిత్వ శాఖను ఆదేశించారని ఆఫ్ఘన్ జల , ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార డిప్యూటీ మంత్రి ముహాజర్ ఫరాహి ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సిందు నదీ జలాల నిలిపేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ కు ఆప్ఘనిస్తాన్ కునార్ నది నీటిని కూడా నిలిపేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో పుట్టే కునార్ నది 480 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూంవాలోకి ప్రవేశించే ముందు ఈ నది ఆప్ఘన్ లోని కునార్, నంగార్హర్ ప్రావిన్స్ లను దాటుతుంది. ఆ తర్వాత జలాలాబాద్ వద్ద కాబూల్ నదితో ఇది కలుస్తుంది. కునార్ నదిని పాకిస్తాన్ లో ఛిత్రాల్ నదిగా పిలుస్తారు.












Click it and Unblock the Notifications